నితీశ్కు బీజేపీ ఊహించని షాక్- కాషాయం గూటికి ఆరుగురు ఎమ్మెల్యేల జంప్
బీహార్ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టిన బీజేపీ తాజాగా ఆయనకు షాకిచ్చింది. జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. అయితే ఇది బీహార్లో కాదు అరుణాచల్ ప్రదేశ్లో. దీంతో అరుణాచల్ ప్రదేశ్లో నితీశ్కు ఇది భారీ షాక్గా మారింది.
గతేడాది అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 15 సీట్లలో పోటీ చేసిన జేడీయూ ఏడు సీట్లలో గెలిచి అసెంబ్లీలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీకి 41 సీట్లు దక్కాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి నలుగురు ఎమ్మెల్యేలు చొప్పున ఉన్నారు. అయితే తాజాగా జేడీయూకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో నవంబర్ 26న వారికి జేడీయూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత వారు మరో నలుగురితో కలిసి అందులో ఒకరిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కు సంబంధం లేకుండానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన చేసేది లేక మౌనంగా ఉన్నారు. దీంతో తాజాగా ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరిపోయారు. తాజా పరిణామంతో 60 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ బలం 47కు పెరిగింది. మరో పార్టీ పీపీఏ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతివ్వడంతో బీజేపీ బలం 48కి చేరింది. అదే సమయంలో జేడీయూకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. అరుణాచల్ పరిణామాలపై నితీశ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.