భారత ప్రభుత్వ పెద్ద విజయం: స్వదేశానికి వచ్చి 13వేల కోట్ల అప్పులు చెల్లిస్తానన్న మాల్యా
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసులో భారత ప్రభుత్వం పెద్ద విజయం సాధించింది. భారత ప్రభుత్వం ఒకదానిపై ఒకటి సంధిస్తున్న అస్త్రాలతో తట్టుకోలేకపోయిన మాల్యా.. ఎట్టకేలకు బ్యాంకులకు బకాయి పడిన రుణాలన్నింటిన్నీ చెల్లించడానికి అంగీకరించాడు.
విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. మాల్యాకు 'పారిపోయిన నేరస్థుడి' ట్యాగ్ ఇవ్వాలని ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది కూడా. అంతేగాక, ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం 'పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్' కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని, ఆయనకు చెందిన రూ.12,500 కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ఈడీ ఇటీవల ముంబై కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాల్యా లండన్ మీడియా వర్గాల ద్వారా స్పందించారు.
అప్పులన్ని సెటిల్ చేస్తా
ప్రభుత్వం తనపై తీసుకుంటున్న క్రిమినల్ చర్యలతో విసిగిపోయానన్నారు. త్వరలో తాను బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలన్నీ సెటిల్ అయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇదే విషయంపై 2016లోనే మాల్యా.. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖ రాసినట్టు కూడా తెలిసింది. ప్రధానికి రాసిన లేఖను కూడా ప్రస్తుతం ఆయన ప్రస్తావించారు. తన లేఖకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
అప్పులు చెల్లించడంతోపాటు భారత్కు..
బ్యాంకుల రుణాలను సెటిల్ చేసుకోవడానికి మాల్యా అంగీకరించారు. అయితే కన్సార్టియం ఆఫ్ బ్యాంకుల విషయంలోనే బోగస్ ఉన్నాయని మాల్యా ఆరోపించారు. కాగా, బకాయిలు చెల్లించడంతోపాటు తాను భారత్కు వచ్చేస్తానని మాల్యా చెప్పడం గమనార్హం.
13వేల కోట్ల రుణాలు చెల్లిస్తానంటూ మాల్యా..
మాల్యా చేసిన తాజా ప్రకటనలో కూడా బ్యాంకులకు బకాయిపడిన రూ.13 వేల కోట్ల మేర రుణాలను తాను చెల్లించడానికి ఒప్పుకుంటున్నట్టు తెలిపారు. మాల్యాను ఎలాగైనా భారత్కు రప్పించాలని దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మాల్యా ఈ ప్రకటన చేశారు.
బ్యాంకులకు ఉపశమనం
అయితే తన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మాల్యా ఆరోపించారు. బ్యాంకులకు భారీగా రుణాలు ఎగ్గొట్టిన మాల్యా, ప్రస్తుతం లండన్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న సంగతి తెలిసిందే. అతన్ని భారత్కు అప్పగించే వ్యవహారంపై లండన్ కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఎట్టకేలకు అప్పులు చెల్లించడంతోపాటు భారత్కు వస్తానని మాల్యా చెప్పడంతో అప్పులిచ్చిన బ్యాంకులు ఊపిరిపీల్చుకుంటున్నాయి.