అల్ ఖైదా, ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ కాల్చివేత: పుల్వామా దాడికి సూత్రధారిగా!
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు కింగ్ పిన్ గా అనుమానిస్తోన్న ఓ కరడు గట్టిన తీవ్రవాదిని మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా అవంతిపొర శివార్లలో మంగళవారం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో హమీద్ లోనె అలియాస్ హమీద్ లెల్హారి, నవీద్ టక్, జునైద్ బట్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ వెల్లడవించారు. వారిలో హమీద్ లెల్హారీ పలు ఉగ్రవాద కార్యకాపాలకు కేంద్రబిందువగా ఉండేవాడని అన్నారు.
కాశ్మీర్ కోసం బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతాలో దాడులు చేస్తాం: ఆల్ ఖైదా, హై అలర్ట్ !
అవంతిపొర శివార్లలో ఓ భవనంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. హమీద్ లెల్హారీ.. భయానక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా జమ్మూ కాశ్మీర్ యూనిట్ కు చీఫ్ గా వ్యవహరించేవాడని దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఇండియన్ ముజాహిదీన్ కమాండర్ జకీర్ ముసా వారసుడిగా గుర్తింపు పొండాడని అన్నారు. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో జకీర్ మూసా హతమయ్యాడు.
జకీర్ ముసా మరణానంతరం అల్ ఖైదాతో పాటు ఇండియన్ ముజాహిదీన్ కార్యకలాపాలను కూడా హమీద్ పర్యవేక్షించేవాడని డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన వెనుక హమీద్ హస్తం ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతని స్వస్థలం పుల్వామేనని, అదే ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జమ్మూ కాశ్మీర్ మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవాడని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీఓకే) భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలతో తరచూ సంప్రదింపులు నిర్వహిస్తుండేవాడని చెప్పారు.
పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహూతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. హమీద్ తో పాటు భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు ఘజ్వత్-ఉల్-హింద్ అనే ఓ స్థానిక సంస్థకు చెందిన వారై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హమీద్ తో పాటు హతమైన నవీద్ టక్, జునైద్ బట్ నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. వారి గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టుకోవడం వల్ల మిగిలిన ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల గుట్టు రట్టువుతుందని డీజీపీ తెలిపారు. ఘజ్వత్-ఉల్-హింద్ సంస్థ పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకుంటున్నామని అన్నారు.
కాగా- ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారి. జకీర్ ముసా మరణించిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు రెండు నెలల కాలం నుంచి పెచ్చరిల్లాయి. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత ఉగ్రవాదులు తరచూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు. కట్టుదిట్టమైన భద్రత వల్ల వారి ఆటలు సాగలేదు. అదే సమయంలో పాకిస్తాన్ భూభాగం పైనుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు భారత్ లోకి చొరబాటుకు విఫల ప్రయత్నాలు చేశారు.