తీర్పుల ఎఫెక్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై లైంగిక ఆరోపణలు.. విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసును విచారణ చేసేందుకు జస్టిస్ అరుణ్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ప్రత్యేక ద్విసభ్య బెంచ్ను జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని చెప్పిన జస్టిస్ రంజన్ గొగోయ్... న్యాయవ్యవస్థ ప్రమాదపుటంచుల్లో ఉందని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దిగజారి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.
న్యాయవ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నాలు
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... న్యాయవ్యవస్థలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అందులో భాగంగానే తనపై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు అని చెప్పారు. తను ఓ ముఖ్య కేసును వచ్చే వారం విచారణ చేయనున్నారని... ఇందులో భాగంగానే న్యాయవ్యవస్థను భయపెట్టి మేనేజ్ చేయాలని చూస్తున్నారని జస్టిస్ రంజన్ గొగోయ్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే వచ్చే వారం జస్టిస్ రంజన్ గొగోయ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన దిక్కార కేసును విచారణ చేయనున్నారు.
లైంగిక ఆరోపణలు చేసిన మహిళ వెనక పెద్దల హస్తం
కొన్ని శక్తులు న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూస్తున్నాయని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. ఇక తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయించిన వారి వెనక పెద్దల హస్తం ఉందని ధ్వజమెత్తారు. అంతేకాదు తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని.. ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుర్తుచేశారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఇంట్లో ఆ మహిళ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. అయితే వేధింపుల కేసులో సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి గోగొయ్ పై ఫిర్యాదు చేయగానే ఆమెను విధుల నుండి తొలగించడం జరిగింది. 20 ఏళ్ల సర్వీసు తర్వాత తన బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు, పీఎఫ్ ఖాతాలో రూ.40 లక్షలు ఉందని చెప్పిన రంజన్ గొగోయ్ డబ్బు అంశంపై తనను ఎవరూ పట్టుకుని ప్రశ్నించరని... ఇక వేరే కారణం కోసం వెతికి తనను ఇరికించే ప్రయత్నంచేస్తున్నారని గొగోయ్ ధ్వజమెత్తారు.
నన్ను ఎవరూ బెదరించలేరు..భయపెట్టలేరు: సీజే
ఇక తనను ఎవరూ బెదిరించలేరని భయపెట్టలేరని చెప్పిన జస్టిస్ రంజన్ గొగోయ్ తన డ్యూటీని తాను చేస్తానని చెప్పారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విచారణలో తన జోక్యం ఉండబోదని చెప్పిన గొగోయ్.. సీనియర్ జడ్జి అరుణ్ మిశ్రా బెంచ్ ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా అందుకు సమ్మతమే అని చెప్పారు. అయితే ఈ కేసు విచారణ చేయాలని చెప్పడంలో తానే బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నందున తానే స్వయంగా విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ గొగోయ్ చెప్పారు. వ్యక్తిగత కక్షలతో మొత్తం న్యాయవ్యవస్థనే టార్గెట్ చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. సోమవారం రోజున అన్నీ కేసులను వాయిదా వేసుకుంటానని చెప్పిన రంజన్ గొగోయ్... ఎవరైన న్యాయమూర్తి కావాలని ఎందుకనుకుంటారు.. అని ప్రశ్నించారు. ఆ వ్యక్తికి ఉన్న మంచి నేపథ్యమే ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. ఇప్పుడు న్యాయమూర్తిపైనే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇక చెప్పేందుకు ఏముందని రంజన్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే జస్టిస్ అరుణ్ మిశ్రా కేసుకు సంబంధించి జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేసేందుకు నిరాకరించారు.మీడియా ఈ కేసుకు సంబంధించి సంయమనం పాటించాలని కోరారు. పసలేని ఆరోపణలతో న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నాలకు బ్రేక్ వేయాలని కోరారు.