భారత్లో కరోనా విజృంభణ: ఒక్కరోజులోనే 3900 కేసులు, 195 మరణాలు, ఆ రాష్ట్రాల వల్లే..
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా మరోసారి విజృంభించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం, లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయని కారణంగానే దేశంలో ఈ కేసులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
Recommended Video
దేశంలో కరోనా బిగ్జంప్.. తొలిసారిగా
గడిచిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 3900 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 395 మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో మొత్తం కరోనావైరస్ బాధితుల సంఖ్య మంగళవారం ఉదయానికి 46,433కు చేరగా, మరణాల సంఖ్య 1568కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 12,727 మంది కోలుకోగా, మరో 32,138 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, భారతదేశంలో కరోనా వైరస్ బయటపడ్డ అనంతరం అత్యధిక కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం రోజు 82,792 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నాటికి రికవరీ రేటు 27.4 శాతం ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
పశ్చిమబెంగాల్ భారీగా పెరిగిన కేసులు..
కాగా, సోమవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీగా కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా బారిన పడగా, 98 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 133కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 1259 కేసులుండగా, 218 మంది కోలుకున్నారు. కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించి వెళ్లిన తర్వాత నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
మమత సర్కారు కరోనా కేసులను దాచేసిందా? అత్యధిక మరణాల రేటు ఇక్కడే
ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం దాచేస్తోందనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దేశంలో అత్యధిక మరణాల రేటు కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 12.8శాతంగా ఉంది.
మహారాష్ట్ర, గుజరాత్లోనూ భారీగా కేసులు
మహారాష్ట్ర, గుజరాత్లోనూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 1567 కొత్త కేసులు, 35 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 14,541కి చేరగా, 538 మంది మరణించారు. ముంబైలోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఇలావుంటే, పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా కొవిడ్ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 376 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5,804కి చేరింది. 319 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడులో ఒక్కరోజులోనే..
ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఒకే రోజు 349 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 4898కి చేరింది. 64 మంది మరణించారు. తమిళనాడులోనూ సోమవారం ఒక్కరోజే 527 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3550కి చేరింది. 31 మంది మరణించారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో 2942 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1365 మంది మరణించారు.