సీట్ల పంపకాల్లో బీజేపీతో విబేధాలు: కేంద్రమంత్రి పదవికి ఉపేంద్ర కుశ్వాహా రాజీనామా
ఆర్ఎల్ఎస్పీ అధినేత కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు బీహార్లో సీట్ల కేటాయింసుల్లో బీజేపీకి ఆర్ఎల్ఎస్పీ పార్టీల మధ్య కొంతకాలంగా విబేధాలు వస్తున్నాయి. దీంతో పార్లమెంటు సమావేశాలకు ఒక్క రోజు ముందు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయానికి పంపారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి కూడా ఉపేంద్ర కుశ్వాహా గైర్హాజరయ్యారు.
సీట్ల పంపకాలపై బీజేపీ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని కుశ్వాహా గతనెల 30న డెడ్లైన్ విధించారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకోకపోతే ఎన్డీఏకు ఇబ్బందులు తప్పవని చెప్పారు. ప్రభుత్వం ఉండాలంటే గౌరవప్రదమైన సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుందని అన్నారు కుశ్వాహా. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్ఎస్పీ బీహార్లో మూడు సీట్లను గెలుచుకుంది. బీజేపీ 22 సీట్లు గెలవగా... ఎల్జేపీ ఆరు గెలిచింది. మహాకూటమి నుంచి బయటకు వచ్చి జేడీయూ బీజేపీతో చేతులు కలపడంతో ఈసారి సీట్ల పంపకాల్లో తేడా కనిపిస్తోంది.
2019 లోక్సభ ఎన్నికలకు ఆర్ఎల్ఎస్పీకి రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తామని బీజేపీ తేల్చడంతో కుశ్వాహా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు బీజేపీ జేడీయూలు చెరో సగం సీట్లలో పోటీ చేస్తాయని సంకేతాలు పంపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కుశ్వాహా. ఇదిలా ఉంటే కుశ్వాహా ఆర్జేడీ కాంగ్రెస్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలున్నాయి.