బీహర్ ఫస్ట్ ఫేజ్లో కోటీ శ్వరులు వీరే.. మొత్తం 375 మంది.. వీరిలో టాప్-3
బీహార్లో అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ఈనెల 28న జరుగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 1064 అభ్యర్థుల్లో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారని వివరించింది.
ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్జేపీ 30 (41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది.
వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది.2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నుంచి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానంలో నిలిచారు. వీరిద్దరి తర్వాత జేడీయూకు చెందిన మనోరమా దేవి రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం విశేషం.