బిహార్ ఎన్నికలపై ఏడీఆర్ షాకింగ్ రిపోర్ట్: 81 శాతం మంది అలాంటి వారే: 5వ తరగతి వరకే
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన ఓ సర్వే దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. పేద రాష్ట్రంగా, వలస కార్మికులకు కేరాఫ్ అడ్రస్గా మారిన బిహార్లో రాజకీయ నాయకులు మాత్రం కోట్లకు పడగెత్తారు. కోటీశ్వరులుగా తేలారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను వెనకేసుకున్నారు. నేర చరిత్ర ఉన్న వారూ ఎక్కువే. అలాగే- కనీస విద్యార్హత కూడా లేని నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
81 శాతం మంది కోటీశ్వరులే..
అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల్లో 81 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను రూపొందించడానికి- నామినేషన్ సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ను ప్రాతిపదికగా తీసుకుంది. 243 మంది అభ్యర్థుల్లో 241 అఫిడవిట్లను పరిశీలించింది ఏడీఆర్ సంస్థ. దారి ఆధారంగా వారి ఆస్తులు, నేర చరిత్ర, విద్యార్హతలను నిర్దారించింది. దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందించింది.
అయిదేళ్లలో భారీగా పెరిగిన కోటీశ్వర ఎమ్మెల్యేల సంఖ్య..
243 మందిలో 194 కొత్త ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల మేర ఆస్తులు ఉన్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. రెండో స్థానంలో రాష్ట్రీయ జనతాదళ్, మూడో స్థానంలో జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నట్లు వెల్లడించింది. 2015 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ సారి కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. అప్పటి ఎన్నికల్లో ఈ శాతం 67గా నమోదైంది. అప్పట్లో 162 మంది కోటీశ్వరులు అసెంబ్లీకి ఎన్నిక కాగా.. ఈ సారి ఈ సంఖ్య 194కు పెరిగింది.
68 కోట్ల రూపాయలతో ఆర్జేడీ ఎమ్మెల్యే టాప్..
కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న కొత్త ఎమ్మెల్యేల్లో బీజేపీ-73, ఆర్జేడీ-87, జేడీయూ-43, కాంగ్రెస్-14 మంది ఉన్నారు. సగటున ఒక్కో ఎమ్మెల్యేకు 4.32 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, నగదు, ఇతర విలాసవంతమైన వస్తువులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జేడీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్ సింగ్ ఆస్తుల విలువ 68 కోట్ల రూపాయలుగా గుర్తించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ-43 కోట్లు, ఆర్జేడీకే చెందిన విభాదేవి ఆస్తులు-29 కోట్ల రూపాయలుగా నిర్దారించింది.
ఆ ఎమ్మెల్యే ఆస్తులు 70 వేల రూపాయలే..
అతి తక్కువ ఆస్తులు ఉన్న కొత్త ఎమ్మెల్యేల జాబితాను కూడా ఏడీఆర్ ప్రకటించింది. ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్వృక్ష సదా ఆస్తులు 70 వేల రూపాయలే. సీపీఐ-ఎంఎల్ (ఎల్) ఎమ్మెల్యే గోపాల్ రవిదాస్ ఆస్తులు లక్ష రూపాయలుగా తేల్చింది. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ ఆస్తులు మూడు లక్షల రూపాయలే. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 శాతం మంది అంటే.. 34 మంది కనీస విద్యార్హత 5 నుంచి 12వ తరగతి వరకు చూపించారు. ఇందులో 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారట. 149 ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Recommended Video
హత్య కేసులున్నవారూ అసెంబ్లీకి..
రెండొంతుల మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ గుర్తించింది. 163 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 123 మందిపై హత్యకేసులు ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. హత్యాయత్నానికి ప్రయత్నించి కేసులు ఉన్నవారూ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆర్జేడీ-54, బీజేపీ-47, జేడీయూ-20, కాంగ్రెస్-10 మంది, సీపీఐ (ఎంఎల్)-10 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ నుంచి గెలిచిన అయిదుమందిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది.