బీజేపీ..బ్యాక్డోర్ ఎంట్రీ: ఎన్నికల అధికారులను అడ్డుగా పెట్టుకుని గెలిచారు: తేజస్వి
పాట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలు తారుమారైన వేళ.. అధికారానికి అతి సమీపంలో ఆగిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత తేజస్వి యాదవ్ మీడియా ముందుకొచ్చారు. ఫలితాలు వెలువడిన తరువాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలపై రాజధాని పాట్నాలో ఆయన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటమిపాలు కావడానికి గల కారణాలపై విశ్లేషించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు తేజ్ ప్రతాప్ యాదవ్, మనోజ్ ఝా సహా కొందరు కొత్త ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
జనతాదళ్ (యునైటెడ్)తో కలిసి అధికారంలో పంచుకొన్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఫలితాలను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకుందని విమర్శించారు. బిహార్ ప్రజల తీర్పు తమ మహాకూటమికి అనుకూలంగా వెలువడిందని అన్నారు. ఎన్డీఏ, మహాకూటమి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు.
ప్రజల తీర్పు తమకు అనకూలంగా వెలువడిందని, బీజేపీ దాన్ని ప్రభావితం చేసిందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను అడ్డుగా పెట్టుకుని ప్రజల తీర్పును, వారి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పరితపిస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికలను ప్రజలు, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల మధ్య సాగిన పోరుగా అభివర్ణించారు. ప్రజలు తమకు అనుకూలంగా ఉండగా.. ఎన్నికల అధికారులు బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఫలితంగా తాము ఓటమిపాలు కావాల్సి వచ్చిందని అన్నారు.
Recommended Video
ఎన్నికల కమిషన్ను అడ్గుగా పెట్టుకుని బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఇదేమీ తొలిసారి కాదని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. 2015లో మహాకూటమి ఆవిర్భవించినప్పటి నుంచీ ఇలాంటి పరిస్థితులను చవి చూస్తున్నామని అన్నారు. ప్రజల తమకు అనుకూలంగా ఓటు వేయగా.. దాన్ని కాదని అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఒకరికి ఇచ్చిన అధికారాన్ని లాక్కోవడం బీజేపీకి కొత్త కాదని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి మరీ అందలం ఎక్కిందని ధ్వజమెత్తారు.