పోలింగ్ వేళ..చిచ్చుపెట్టిన చిరాగ్: నితీష్పై బాంబు: బీజేపీకి గుడ్బై?: ఆర్జేడీ మద్దతుతో
పాట్నా: బిహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆరంభమైన వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీపై బాంబులు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత.. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారతీయ జనతా పార్టీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ బయటికి వస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరి రెండు విడతల ఎన్నికల ప్రచారంలో దీన్నే జనంలోకి తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video
రాష్ట్రీయ జనతాదళ్లో చేరిక
బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ బీజేపీకి గుడ్బై చెప్పడం ఖాయమని లోక్ జన్శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. దీనికి అవసరమైన వ్యూహాలను ఆయన ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. తన పార్టీని రాష్ట్రీయ జనతాదళ్ మద్దతును తీసుకుంటారని జోస్యం చెప్పారు. దాణా కుంభకోణంలో చిక్కుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుపాలు కావడంతో నితీష్ కుమార్ ఆ పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తారని విమర్శించారు. జేడీయు-ఆర్జేడీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని ఆరోపించారు.
జేడీయూకు పడే ప్రతి ఓటూ బిహార్ పతనానికి కారణం..
జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థులకు పడే ప్రతి ఓటూ బిహార్ పతనానికి దారి తీస్తుందని, ఆర్జేడీని బలోపేతం చేస్తుందని చిరాగ్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణమౌతాయని, అది బిహార్ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు. ప్రజలు ఆచితూచి తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇదివరకు జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బిహారీ ఫస్ట్..
నితీష్ కుమార్ పరిపాలనలో బిహార్ 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేకపోయిందని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. బిహారీలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారని, ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని తాము మార్చబోతున్నామని అన్నారు. ఆ విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. బిహారీ ఫస్ట్, నితీష్ రహిత్ బిహార్.. నినాదాన్ని తాము జనంలోకి తీసుకెళ్తున్నామని, ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని చెప్పారు.
బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు..
నితీష్ కుమార్ వైఖరిని బీజేపీ అధిష్ఠానం ముందుగానే పసిగట్టిందని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అందుకే- జేడీయూకు ప్రత్యామ్నాయ పార్టీ కోసం అన్వేషిస్తోందని, ఆ లోటును తాము భర్తీ చేస్తామని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ-ఎల్జేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బీజేపీ-ఎల్జేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని బిహారీలు ఆదరిస్తారని అన్నారు. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జేడీయూ, ఆర్జేడీలకు ఓటు వేయడం వల్ల ఉపయోగడం ఉండబోదని చిరాగ్ అన్నారు.