మరికొద్ది గంటల్లో బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పాట్నా: బీహార్ రాష్ట్రం తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కు సిద్ధమైంది. బుధవారం సుమారు 2 కోట్లకు మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలుండగా, మొదటి విడతగా 71 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు పాటిస్తూ ఓటింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1000-1600 మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
ఈవీఎంలన్నింటినీ ఇప్పటికే శానిటైజేషన్ చేసి, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటు వేసేందుకు వచ్చినవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. తొలి విడతగా మొత్తం 2.14 కోట్ల మంది కోట్ల మంది తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
71 స్థానాలకు గానూ 952 మంది పురుషులు, 114 మంది మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. అత్యధికంగా గయప పట్టణంలో అసెంబ్లీ స్థానానికి 27 మంది బరిలో ఉండటం గమనార్హం. తొలి దశ ఎన్నికల్లో అధికార జేడీయూ 35 చోట్ల, మిత్రపక్షం 29 చోట్ల బరిలో నిలిచింది.
ప్రతిపక్ష ఆర్జేడీ 42 చోట్ల, కాంగ్రెస్ 20 చోట్ల తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 41 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో .35 స్థానాల్లో అధికార జేడీయూతోనే పోటీ ఉండటం గమనార్హం. మరికొద్ది గంటల్లో 71 స్థానాలకు ఎన్నికలు ఓటింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన కీలక నేతలు, మంత్రులు కూడా బరిలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.