లోటస్ పార్టీకి లిట్మస్ టెస్ట్: తొలి విడత పైచేయి ఎవరిది? ఆధిపత్యాన్ని సాధించే దిశగా
పాట్నా: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన బిహార్లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో తొలిదశలో 71 స్థానాలకు పోలింగ్ను నిర్వహిస్తున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. గడువు దాటినప్పటికీ.. క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు అధికారులు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
16 జిల్లాల్లో 71 అసెంబ్లీ స్థానాల్లో..
మొత్తం 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ స్థానాల కోసం వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్), ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రీయ జనతాదళ్ పోటీ పడుతున్నాయి. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అభ్యర్థుల గెలపోటములను ప్రభావితం చేయగలవని అంటున్నారు.
ఎన్డీఏ నుంచి బయటికి
దివంగత నేత రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ.. ఈ సారి ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇదివరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగినప్పటికీ.. సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టడంతో ఎల్జేపీ.. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది. కేంద్ర మాజీమంత్రి ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ పరిస్థితీ అంతే. ఈ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో రెండు కీలక పార్టీలు వైదొలగిన ప్రభావం జేడీయూ-బీజేపీపై ఖచ్చితంగా పడుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఎన్నికల వరాలు ఫలిస్తాయా?
ఈ పరిస్థితుల్లో తొలివిడత పోలింగ్లో ఏ పార్టీ ఆధిపత్యాన్ని చలాయిస్తుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, షెడ్యూల్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు.. కేంద్ర ప్రభుత్వం బిహార్కు ఏకంగా ఆరువేల కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించింది. వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా స్పష్టం కాబోతోంది. బిహార్ను అభివృద్ధి చేయాలనుకుంటే.. ఎన్నికల సమయంలో మాత్రమే కేంద్రం వరాలను కురిపించిందంటూ ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలు ఎంతమేర బిహారీలపై ప్రభావం చూపాయనేది ఈ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది. రెండో దశకు పోలింగ్ వచ్చేనెల 3న, మూడో దశ పోలింగ్ 7వ తేదీన నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ చేశారు. 10వ తేదీన ఫలితాలు వెలువడతాయి.