ఈసీ సంచలన నిర్ణయం - షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు - సీఎంకు అసలైన 5 సవాళ్లివే..
దేశంలోనే అతి తక్కువ టెస్టింగ్స్ జరుగుతోన్న రాష్ట్రం.. కేసుల డబ్లింగ్ లో జాతీయ సగటు కంటే రెట్టింపు.. ఇది చాలదన్నట్లు వరదల బీభత్సం.. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో తిరిగొచ్చేసిన వలస కూలీలు.. ఉపాధి అవకాశాలు పూర్తిగా అడుగంటాయి.. లా అండర్ ఆర్డర్ అదుపుతప్పి పట్టపగలే దోపిడీలు చోటుచేసుకుంటున్నాయి.. వీటిలో ఏ ఒక్క సమస్యకూ కేంద్ర, రాష్ట్రాలు పరిష్కారాలు చూపలేకపోతున్నవేళ.. బీహార్ ప్రజాస్వామిక పండుగకు మాత్రం సిద్ధమవుతున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..
రూల్స్ సవరించైనా ఎన్నికలు..
ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా విలయ కాలంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంగా బీహార్ మరో రికార్డును నెలకొల్పనుంది. సెప్టెంబర్-అక్టోబర్ లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని, కరోనా పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సవరించైనాసరే పోలింగ్ చేపట్టితీరుతామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మంగళవారం స్పష్టం చేశారు. మెజార్టీ ప్రజలు ఇంకా విపత్తుల్లోనే కొట్టుమిట్టాడుతుండగా.. రాష్ట్రంలో మళ్లీ రాజకీయవేడి రాజుకుంది. అయితే, నాలుగో టర్మ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటోన్న నితీశ్ కుమార్ కు ఈ ఎన్నికలు పెను సవాలుగా మారనున్నాయి. ఎందుకంటే..
ఐదు ముఖ్యాంశాలివే..
ఎన్నికలకు సిద్ధమవుతోన్న వేళ బీహార్ కు సంబంధించి.. కరోనా విలయం, వరద బీభత్సం, వలస కూలీలు, అదుపు తప్పిన అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, నిరుద్యోగ తాండవం లాంటి అంశాలు ప్రధానంగా మారాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి 10 లక్షల మందిలో 18,086 మందికి కరోనా టెస్టులు చేస్తుండగా, బీహార్ లో మాత్రం ఆ సంఖ్య 7,917 మాత్రమే. ఇప్పటిదాకా అంతా కలిపి 11.8లక్షల టెస్టులు చేయగా, 87వేల పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆరోగ్య రంగంలో అట్టడుగున ఉన్న బీహార్ లో ఆస్పత్రుల సంఖ్యా తక్కువే. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి టెస్టుల నిర్వహణపై అవగాహన లేకపోవడంతో డాక్టర్లు సైతం డ్యూటీలు తప్పించుకుంటున్నారనే విమర్శలున్నాయి. కరోనాను హ్యాండిల్ చేయడంలో నితీశ్ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. లాలూ హయాంలో ఆస్పత్రులు కట్టనందుకే రాష్ట్రంలో దుస్థితి ఏర్పడిందంటూ నితీశ్ సహచరుడు, బీజేపీ నేత సుశీల్ మోదీ వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నది.
వైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలు
వరుస విలయాలతో అతలాకుతలం..
దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి గుజరాత్ దాకా అన్ని రంగాల్లో బీహార్ వలస కూలీలు పనిచేస్తారన్న సంగతి తెలిసిందే. రాత్రికిరాత్రే విధించిన లాక్ డౌన్ తో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది బీహారీలు సొంత రాష్ట్రానికి వచ్చేశారు. యూపీలోనూ వలసల తిరుగుముఖం ఉన్నప్పటికీ ఉపాధి హామీకి నిధులు పెంచడం ద్వారా యోగి సర్కార్ నెట్టుకొస్తుంది. కానీ బీహార్ లో అలాంటి పరిస్థితి లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి బీహార్ లో 31.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు నెలల్లోనే 46.6 శాతానికి పెరిగిందని కేంద్ర సంస్థల స్వేలోనే తేలింది. ఈ దశలోనే గడిచిన మూడు వారాలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద విలయానికి లక్షల మంది బతుకులు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికీ వేల గ్రామాలు కోలుకోలేని దశలో ఎన్నికల ప్రకటన కలకలం రేపుతున్నది.
Recommended Video
నితీశ్ కు అసలైన సవాళ్లివే..
బీహార్ లో వరదలు రావడం కొత్తేమీ కాదు, కానీ కరోనా, తిరుగు వలసలు, నిరుద్యోగం తాండవిస్తున్నవేళ జనం హాహాకారాలు రెట్టింపయ్యాయి. వరదల నియంత్రణకు చర్యలు చేపడతాన్న నితీశ్ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఈ ఏడాది భారీ స్థాయిలో 20 జిల్లాల్లో సుమారు 60 లక్షల మంది వరదకు ఎఫెక్ట్ అయ్యారు. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. పల్లెల్లు, పట్టణాల్లో దరిద్రం తాండిస్తోన్నవేళ పట్టపగలే దుకాణాల లూటీలు, బెదిరింపులు, హత్యలు పెరిగిపోయాయి. ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎప్పటికప్పుడు నితీశ్ తీరును ఎండగడుతుండగా, ఎన్టీఏ భాగస్వామి ఎల్జేపీ పార్టీ సైతం సీఎంపై నిప్పులు చెరుగుతున్నది. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల కంటే ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులే నితీశ్ కు అసలైన సవాళ్లుగా నిలిచాయి.