హోరాహోరీ పోరు..హంగ్ దిశగా? తొలి ఫలితాల్లో దూసుకెళ్తోన్న ఆర్జేడీ: కింగ్ మేకర్ ఆయనేనా?
పాట్నా: బిహార్లో ఈ సారి హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో రెండు సంకీర్ణ కూటములు ఆధిక్యతను కనపరుస్తున్నాయి. ఒకట్రెండు సీట్ల వ్యత్యాసంతో లీడ్లో ఉంటున్నాయి. ఇప్పటిదాకా 54 స్థానాలకు సంబంధించిన ప్రారంభ ఫలితాలు వెలువడగా..రాష్ట్రీయ జనతా దళ్ సారథ్యంలోని మహాకూటమికి 33 చోట్ల.. జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. 21 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి.
Recommended Video
టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్
ఈ సంఖ్య అంతకంతకూ మారుతూపోతోంది. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ కూటమికి అధికారాన్ని అందుతుందా? లేక మహాకూటమి ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. ఒకట్రెండ్ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారం..బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటమంటూ జరిగితే చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ కింగ్ మేకర్గా అవతరించే అవకాశాలు లేకపోలేదు.
అతి తక్కువ సీట్లకే ఎల్జేపీ పరిమితమౌతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ కొద్దిమేర సీట్లను సాధించిన ఎల్జేపీ.. ఎవరికి మద్దతు ఇస్తే.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలనూ కొట్టి పారేయట్లేదు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో 7,29,27,396 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 63 శాతం మంది ఓటర్లు ఈ సారి మార్పును కోరుకున్నారని ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి.
అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ప్రతిపక్షం నుంచి రాష్ట్రీయ జనతాదళ్-115, కాంగ్రెస్-70, సీపీఐ-ఎంఎల్-19, సీపీఐ-6, సీపీఐఎం-4 సీట్లల్లో పోటీ చేశాయి. ఆర్జేడీ సారథ్యంలో ఆయా పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఏడుకోట్ల మంది బిహారీయులు ఈ పార్టీల్లో ఎవరిని ఎన్నుకున్నారనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ రూపాన్ని దాల్చితే.. తేజస్వి యాదవ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.