బిహార్ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి: 166 స్థానాల్లో: పేరుకే ఆధిక్యత: ఏ రౌండ్లోనైనా తారుమారు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఎన్నికల్లోనైనా అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటం సహజమే. అలాంటి నియోజకవర్గాల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. మెజారిటీ సీట్లల్లో అభ్యర్థుల మధ్య మెజారిటీ భారీగా కొనసాగుతుంటుంది. బిహార్ దీనికి భిన్నం. 50 కాదు.. వందా కాదు.. ఏకంగా 166 అసెంబ్లీ స్థానాల్లో ఇలాంటి వాతావరణం నెలకొంది. ఆయా స్థానాల్లో అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల తేడా 2000 లోపే. ఇందులో 500ల వరకు ఓట్ల తేడా ఉన్న స్థానాలు అధికం.
Today's Chanakya: నో హంగ్.. నో నితీష్: ఆర్జేడీ కూటమికే బిహార్: లాలూ కుమారుడికే పట్టం
ఈ స్వల్ప తేడాను తాము అధిగమించగలుగుతామని రాష్ట్రీయ జనతాదళ్ కూటమి నేతలు ధీమాగా చెబుతున్నారు. గెలుపుపై చివరి వరకూ తమకు ఆశలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మధ్య రౌండ్లల్లో వెనుకంజలో ఉన్న ఆర్జేడీ కూటమి అభ్యర్థులు మళ్లీ పుంజుకోవడం వారికి ఊపిరిపోసినట్టవుతోంది. చాలాచోట్ల జనతాదళ్ (యునైటెడ్)-బీజేపీ అభ్యర్థుల ఆధిక్యత రౌండ్ రౌండ్కూ తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తగా 166 అసెంబ్లీ నియోజకవర్గాల్లో- 1000 లోపు ఆధిక్యత ఉన్న నియోజకవర్గాలు 30 వరకు ఉన్నాయి. లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ సంఖ్య మారుతోంది. అభ్యర్థుల మధ్య 2000 లోపు ఆధిక్యత ఉన్న స్థానాల సంఖ్య 80. 23 స్థానాల్లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్య తేడా 500 ఓట్ల లోపే. ఇన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా వాతావరణం నెలకొనడం అరుదుగా చెప్పుకోవచ్చు. ఆ రెండు పార్టీల మధ్య ఎంత హోరాహోరీగా పోరు కొనసాగుతోందనేది దీనితో స్పష్టమౌతోంది.
Recommended Video
బిహార్లో కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా నడుస్తోంది. చాలాచోట్ల రౌండ్ల లెక్కింపులో ఆశించిన స్థాయిలో వేగం కనిపించట్లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు 1.69 కోట్ల ఓట్లను లెక్కించారు. ఇంకా 4.16 కోట్ల ఓట్లను లెక్కించాల్సి ఉంది. చాలా చోట్ల అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాల వల్ల ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడానికీ వీలు కల్పించినట్టయింది. చివరి రౌండ్ వరకూ తాము గెలుపుపై ఆశలను కోల్పోలేమని ఆర్జేడీ నేతలు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.