వైఎస్ జగన్ రాజకీయ వ్యూహకర్తకు ఏమైంది?: గుడ్బై చెప్పారా? రిజల్ట్స్ వేళ..
పాట్నా: వచ్చే అయిదేళ్ల పాటు బిహార్ను శాసించే అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న వేళ.. అధికారంలో కొనసాగిన జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహాకూటమి మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతోన్న సమయంలో.. విస్తృతంగా వినిపించాల్సిన పేరు..ప్రశాంత్ కిషోర్. తన సొంత రాష్ట్రం కాకపోయినప్పటికీ.. పెంచి పోషించిన బిహార్లో వాడివేడిగా ఎన్నికల నడుస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడే గానీ ఆయన కనిపించట్లేదు.. పేరు వినిపించట్లేదు.
వైఎస్ జగన్కు స్ట్రాటజిస్ట్గా
ఏపీలో గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో ఏకపక్షంగా విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అయ్యాయనేది బహింరంగ రహస్యమే. వైఎస్ఆర్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. ఇదివరకు ఎన్డీఏ కూటమికీ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఏడాది కిందట ఆయన జనతాదళ్ (యునైటెడ్)లో చేరారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులు అయ్యారు.
నితీష్తో విభేదించి.. జేడీయూ నుంచి బయటికి..
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన ప్రదర్శనలు చెలరేగిన తరువాత.. ఆయన జేడీయూతో విభేదించారు. ఈ చట్టం వల్ల బిహార్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండబోదనీ వ్యాఖ్యానించారు. దీనితో జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆగ్రహానికి గురయ్యాారు ప్రశాంత్ కిషోర్. జేడీయూ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అప్పటి నుంచ ఆయన దాదాపుగా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటిదాకా ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారనేది సమగ్రంగా తెలియరావట్లేదు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం?
జేడీయూ నుంచి బయటికి వచ్చిన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. బిహార్లో తన పాత పార్టీ అధికారాన్ని నిలబెట్టుకునే దశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ఎందుకు స్పందించట్లదేనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. తనను వెలివేసిన జేడీయూకు వ్యతిరేకంగా కొద్దిరోజుల పాటు వ్యూహాలను రూపొందించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. దాన్ని ఎవరూ నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారని, ప్రతిపక్ష పార్టీ డీఎంకేకు వ్యూహకర్తగా పనిచేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. డీఎంకే విజయాల కోసం వ్యూహాలను రూపొందిస్తున్నారని అంటున్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లల్లో
అదే సమయంలో- పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు కూడా ఆయన రాజకీయ సలహాదారుగా ఉంటున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. క్రమంగా బలపడుతోన్న బీజేపీని ఎదుర్కొనడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆయన సహాయాన్ని తీసుకుంటున్నారనే వార్తలు ఉన్నాయి. అవెలా ఉన్నప్పటికీ.. బిహార్ ఎన్నికల సందర్భంగా ఆయన పేరు ఎక్కడా వినిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతోంది.