రివర్స్ ఆపరేషన్ ఆకర్ష: ఎన్నికల ముంగిట్లో బీజేపీకి ఎదురుదెబ్బ: ఎన్డీఏ నుంచి బయటికి: వలసలు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో భారతీయ జనతా పార్టీ తడబడుతోంది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై దీని ప్రభావం పడుతోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొడుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నుంచి మరో మిత్రపక్షం బయటికి వెళ్లిపోయింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి గుడ్బై చెప్పింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది. అన్ని అసెంబ్లీ స్థానాలకూ అభ్యర్థులను నిలబెట్టే దిశగా కసరత్తు ఆరంభించింది.
జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యం
అక్కడితో ఆగలేదు ఆ మిత్రపక్షం. వలసలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్షను చేపట్టింది. అదే- చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ). బిహార్ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవట్లేదని, ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన ప్రకటించిన రెండోరోజే.. రివర్స్లో ఆపరేషన్ ఆకర్షను ప్రారంభించారు. రాజకీయ వలసలను ప్రోత్సహిస్తున్నారు. బీజేపీకి చెందిన రాష్ట్రస్థాయి కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు.
తాజాగా- బీజేపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉషా విద్యార్థి పార్టీకి గుడ్బై చెప్పారు. ఎల్జేపీలో చేరారు. ఈ సారి ఆమె ఎల్జేపీ టికెట్ మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1992లో ఆమె బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఇన్నేళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా ఎల్జేపీ.. ఎన్డీఏ కూటమికి గుడ్బై చెప్పడంతో ఆమె ఆ పార్టీలో చేరారు.
ఇదివరకు బిహార్ బీజేపీ రాష్ట్రశాఖ మాజీ ఉపాధ్యక్షుడు రాజేంద్ర సింగ్.. ఎల్జేపీలో చేరిన విషయం తెలిసిందే. రాజేంద్ర సింగ్ అల్లాటప్పా నాయకుడేమీ కాదు. 2015 ఎన్నికల్లో రాజేంద్ర సింగ్ను బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 36 సంవత్సరాల పాటు ఆయన బీజేపీలో పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయనకు అనుబంధం ఉంది. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటించిన మరుసటి రోజే రాజేంద్రసింగ్ ఆయనతో జట్టు కట్టారు.