ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..
ఉత్తరాదిలో ఇప్పటిదాకా బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక రాష్ట్రం బీహార్. ఈసారి కూడా సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే జేడీయూతో కలిసి బీజేపీ బరిలోకి దిగింది. అయితే, ఫలితాలను బట్టి నితీశ్ ను పక్కకు నెట్టేసి, చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ) సాయంతో కమలనాథులు బీహార్ ను హస్తగతం చేసుకునేలా ప్లాన్ వేశారని ఓ ఆరోపణ. 2015 ఎన్నికల్లో జేడీయూతో కలిసి ఘనవిజయం సాధించినా, ఏడాదిన్నరలోపే నితీశ్ పల్టీ కొట్టడంతో అధికారానికి దూరమైన ఆర్జేడీ.. ఈసారి యువనేత తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలో సర్కారు ఏర్పాటుపై ధీమాగా ఉంది. కరోనా కాలంలో జరుగుతోన్న తొలి ఎన్నికలుగానే కాకుండా, లాక్ డౌన్ అనర్థాలు, ఆర్థిక వ్యవస్థ పతనం నేపథ్యంలోనూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం..
బీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజు
మొదటి దశ ప్రచారానికి తెర..
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ ఉండగా, మొదటి దశలోని 71 స్థానాల్లో సోమవారం సాయంత్రం నాటికి ప్రచారం ముగిసింది. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం(మాంఝీ పార్టీ), వీఐపీ పార్టీలు ఎన్డీఏ కూటమిగా పోటీచేస్తుండగా, ఆర్జేడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మహా కూటమిగా బరిలోకి దిగాయి. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ ఒంటరిగా 137 చోట్ల పోటీకి దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని బీహార్ సీఎం నితీశ్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర వీవీఐపీలు ఎన్డీఏ అభ్యర్థుల తరఫున గట్టిగా ప్రచారం చేశారు. ఎన్నికల చాణక్యుడిగా పేరుపొందిన అమిత్ షా మాత్రం ఒక్కసభలోనూ పాల్గొనకపోవడం గమనార్హం. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ సభలకు భారీగా జనం తరలిరావడంతో కొవిడ్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఆయనపై ఫిర్యాదు నమోదైంది. ఫస్ట్ ఫేజ్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
71 సీట్లు.. 2.14కోట్ల ఓటర్లు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భాగంగా 16 జిల్లాల్లోని ఈ 71 నియోజకవర్గాల్లో బుధవారం(28న) పోలింగ్ జరుగనుంది. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, ఎన్నికల సిబ్బంది పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 71 నియోజకవర్గాలకుగానూ మొత్తం 31వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ స్థానాల్లో అర్హులైన ఓటర్ల సంఖ్య 2.14 కోట్లుకాగా, అన్ని పార్టీలు, ఇండిపెండ్లను కలిపి మొత్తం 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందని, మాస్కు లేనివాళ్లను బూత్ లోకి రానివ్వబోమని, కరోనా పేషెంట్లు విడిగా ఓట్లేసేందుకు ఏర్పాట్లు చేశామని ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుతామన్నారు.
బీహార్ ఫస్ట్ ఫేజ్ సిత్రాలివి..
మొదటి దశ పోలింగ్ జరుగనున్న 71 స్థానాలకు మొత్తం 1066 మంది పోటీలో ఉండగా, వారిలో 30 శాతం మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. అందులో 153 మంది కోటీశ్వరులున్నారు. ఎన్డీఏ టికెట్లు దక్కిన వారిలో 60 శాతం మంది, మహాకూటమి నుంచి పోటీచేస్తోన్న 58 శాతం మంది ధనవంతులే ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ క్యాండిడేట్లలో మహిళల శాతం కేవలం 13.5 శాతంగా ఉంది. ఈసారి బీహార్ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధానాంశంగా మారిన వేళ కొత్త ఓటర్ల సంఖ్య (2015తో పోల్చుకుంటే) 50 శాతం పడిపోవడం అనుమానాలకు తావిస్తున్నది. నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ తో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి. అదే నెల 10న ఫలితాలు వెలువడుతాయి. పలు జాతీయ చానెళ్ల సర్వేల్లో మళ్లీ ఎన్డీఏనే గెలుస్తుందని వెల్లడైనా, సోషల్ మీడియా వేదికల్లో వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు మాత్రం తేజస్వీకి అనుకూలంగా ఉండటం గమనార్హం.
షాకింగా? సహజమా?: పేద రాష్ట్రంలో 60శాతం క్యాండిడేట్లు కోటీశ్వరులే - అతిపేద అభ్యర్థి ఆస్తి రూ.3వేలు