Bihar polls:జేడీయూ - బీజేపీల మధ్య ముగిసిన సీట్ల పంపకం.. రాజుకుంటున్న రాజకీయ వేడి
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తొలి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా మంగళవారం రోజున నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదల్ యునైటెడ్ (జేడీయూ) బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపకాల ఎపిసోడ్ ముగిసింది. రెండు పార్టీల మధ్య సీట్లపంపకాలు పూర్తయ్యాక బీహార్ సీఎం నితీష్ కుమార్ మరియు బీజేపీ నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ అసెంబ్లీకి 243 సీట్లు ఉండగా జేడీయూ 122 సీట్లలో పోటీచేయనుండగా.. బీజేపీ 121 సీట్లలో పోటీ చేసేలా ఏకాభిప్రాయం కుదిరింది. అయితే జేడీయూ కోటోలోని 122 సీట్లలో 7 సీట్లు జితన్ రామ్ మాంఝీ పార్టీ అయిన హిందుస్తాన్ అవాం మోర్చాకు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఆ ఏడు సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మిందుస్తాన్ అవాం మోర్చా పార్టీ విడుదల చేసింది.
బీజేపీ జేడీయూల మధ్య సీట్ల పంపకం దాదాపు ఫిఫ్టీ-ఫిఫ్టీగా సాగింది. ఇదిలా ఉంటే బీజేపీ మరియు వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ మధ్య కూడా చర్చలు జరగుతున్నట్లు సమాచారం. ఒకవేళ చర్చలు సఫలం అయితే బీజేపీ కోటా నుంచి వీఐపీకి సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు లోక్జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో సీట్ల పంపకాల్లో గణాంకాలు మారాయి. ఇదిలా ఉంటే జేడీయూ-బీజేపీల మధ్య బంధం బలంగా ఉందని అదే సమయంలో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని స్పష్టం చేశారు బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ సంజయ్ జైస్వాల్. నితీష్ కుమార్ అనుమతి లేనిదే కొత్తవారు అలయన్స్లోకి రావడం కానీ ఉన్నవారు బయటకు పోవడం కానీ జరగదని స్పష్టం చేశారు.
మరోవైపు బీహార్ బీజేపీ నేత, బీజేపీ తరపున అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవీంద్ర ఫడ్నవీస్లు పాట్నాలోని నితీష్ కుమార్ నివాసంకు వెళ్లి ఆయన్ను కలిశారు. పలు అంశాలపై చర్చించారు. జేడీయూకు ఈ సారి ఓటువేశారంటే తమ పిల్లల భవిష్యత్తును కాలరాసిన వారవుతారని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ బిహారీలకు బహిరంగ లేఖ రాశారు. కొన్ని కోట్ల మంది బీహారీల భవిష్యత్తును తీర్చి దిద్దే ఎన్నికలు ఇవనీ చిరాగ్ పాశ్వాన్ లేఖలో పేర్కొన్నారు. ఈ రోజు జేడీయూకు వేసే ప్రతి ఓటు రేపు మీ పిల్లలను రాష్ట్రం నుంచి తరిమివేస్తుందనే విషయాన్ని గుర్తెరగాలని కోరారు. తామెప్పుడు ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోలేదని, పొత్తులన్నీ ఎన్నికలకు ముందే జరిగాయన్న విషయాన్ని చిరాగ్ పాశ్వాన్ గుర్తు చేశారు.
Recommended Video
మొత్తానికి తొలి బీహార్లో సీట్ల పంపకాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అక్టోబర్ 28న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరుగనుంది.