లాలూ ప్రసాద్ను వెంటాడుతోన్న దుమ్కా ట్రెజరీ కేసు: జైలు జీవితమే: అనారోగ్యంలోనూ
రాంచి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్ మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. శనివారం ఉదయం 7 గంటలకు చివరిదశ పోలింగ్ ఆరంభమౌతుంది. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని.. ప్రీ పోలింగ్ ఎత్తుగడలపై కన్నేసిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఆర్జేడీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ పిటీషన్పై విచారణ వాయిదా పడింది. దుమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుశిక్షను అనుభవిస్తున్నారు. చైబాసా ట్రెజరీ కేసుతో సంబంధం ఉన్న 950 కోట్ల రూపాయల దాణా స్కామ్లో జార్ఖండ్ హైకోర్టు ఇదివరకే లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్ మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు. గతంలో ఉమ్మడి బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైబాసా ట్రెజరీ నుంచి 33.67 కోట్ల రూపాయలను ఆయన అక్రమంగా విత్డ్రా చేశారు. ఈ కేసులో లాలూకు ఊరట లభించినప్పటికీ ఆయన విడుదల కాలేదు. దుమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ లభించలేదు.
ఈ కేసులో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ లాలూ ప్రసాద్ దాఖలు చేసిన పిటీషన్పై విచారణను జార్ఖండ్ హైకోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడంతో మరికొద్దిరోజుల పాటు ఆయన జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. ఉమ్మడి బిహార్లో 1991 నుంచి 1996 మధ్య లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో చోటు చేసుకున్న దాణా స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు గాను ఆరు కేసుల్లో దోషిగా తేలారు. 2017 నుంచి లాలూ ప్రసాద్ జైలులోనే ఉన్నారు.
ప్రస్తుతం అనారోగ్య కారణాల వల్ల ఆయన జార్ఖండ్లోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతుననారు. టైప్-2 డయాబెటిస్, హైపర్ టెన్షన్కు చికిత్స పొందుతున్నారు. లాలూ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని 0తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ.. దుమ్కా ట్రెజరీ కేసు వెంటాడుతోంది.