బీహార్ ఎన్నికల సర్వే సత్యాలు: నితీష్ కుమార్ పై ప్రజలు ఏమనుకుంటున్నారు..ప్రధానిగా మోడీ ఓకేనా..?
మరో 20 రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే సర్వేల సందడి ప్రారంభమైంది. ఇక నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రజల నాడి ఎలాగుందో టైమ్స్నౌ సీ ఓటర్ సయుక్త సర్వే నిర్వహించాయి. అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల స్పందన కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకున్నారు. కరోనావైరస్ మహమ్మారిని మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది..?ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంతృప్తితో ఉన్నారా.. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరు లాంటి అంశాలపై ప్రజలను సర్వే సందర్భంగా ప్రశ్నించడం జరిగింది.
ఎన్డీఏ పనితీరు ఎలాగుంది..?
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పనితీరు ఎలాగుంది.. అని బీహార్ ప్రజలను ప్రశ్నించగా అందుకు 36.27శాతం మంది చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. 31.86శాతం మంది మాత్రం సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పగా 31.58శాతం మంది మాత్రం అస్సలు బాగా లేదని తేల్చేశారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించగా 43.89 శాతం మంది సంతృప్తితో ఉన్నట్లు చెప్పగా... కొంతవరకు ఫర్వాలేదని 31.16శాతం మంది చెప్పారు. 24.95శాతం మంది మాత్రం అస్సలు సంతృప్తితో లేమని చెప్పారు. అయితే చెప్పలేమని ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు..?
ప్రధానిగా ఎన్నుకునే అవకాశం మరోసారి వస్తే మోడీని ఎన్నుకుంటారా.. లేక రాహుల్గాంధీని ఎన్నుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం ఇలా ఇచ్చారు. నరేంద్ర మోడీని ఎన్నుకుంటామని 66.07శాతం మంది చెప్పగా... రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నామని 23.73 శాతం మంది సమాధానం ఇచ్చారు. వీరిద్దిలో ఎవరూ వద్దని 5.93 శాతం మంది చెప్పగా ఏమో తెలియదు చెప్పలేమని 4.28శాతం మంది చెప్పారు.
నితీష్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా..?
ఇక రాష్ట్ర ముఖ్య మంత్రి పనితీరుపై ఎంత సంతృప్తిగా ఉన్నారనే ప్రశ్న అడుగగా..చాలా సంతృప్తితో ఉ్ననామన్నవారు 25.4శాతం ఉండగా కొంతవరకు సంతృప్తి చెందామని 34.29శాతం మంది చెప్పారు. అస్సలు సంతృప్తిగా లేదని చెప్పిన వారు 40.24శాతం మంది ఉన్నారు. ఇక ఎవరిపై ఆగ్రహంతో ఉండి వారిని మార్చాలని భావిస్తున్నావనే ప్రశ్న అడుగగా ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పినవారు 24.1శాతం మంది, కేంద్ర ప్రభుత్వం మారాలని 12.27శాతం భావిస్తుండగా... సిట్టింగ్ ఎమ్మేల్యేలను మార్చాలని 10.19శాతం మంది చెప్పారు. ఇతరులు అని 53.44 శాతం మంది వెల్లడించారు.
Recommended Video
ప్రధాన సమస్య ఏంటి..?
ఇక ప్రధాన సమస్య ఈ రోజు ఉన్నదేమిటి అని అడుగగా నిరుద్యోగ సమస్య ఉందని 51.16శాతం మంది చెప్పారు. కరోనా లాంటి వ్యాధుల సమస్యగా ఉందని 12.61శాతం మంది చెప్పారు. ఇక అవినీత సమస్య ఉందని 7.43శాతం మంది సమాధానం ఇవ్వగా ఇతర సమస్యలను 28.83 మంది ప్రస్తావించారు. ఇక బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఎంతవరకు సంతృప్తి చెందారనే ప్రశ్నకు చాలా బాగా సంతృప్తి చెందామని 19.01 శాతం మంది చెప్పగా కొంత వరకు సంతృప్తి చెందామని 43.32 శాతం మంది వెల్లడించారు. సంతృప్తగా లేమని 37.67 శాతం మంది చెప్పారు. ఏమో తెలియదు చెప్పలేమని ఎవరూ సమాధానం ఇవ్వలేదు.
మొత్తానికి బీహార్లో నితీష్ కుమార్ భవిత్యం ఏమిటనేది మరికొన్ని రోజుల్లోనే బయటపడనుంది. ఇక సర్వేల సందడి మొదలు కావడంతో బీహార్లో రాజకీయం వేడెక్కింది.