ఇంత ఆలస్యంగా వస్తారా?: బీజేపీ ఎంపీపై కుర్చీలతో దాడి
పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎంపీపై దాడికి దిగారు.
వివరాల్లోకి వెళితే.. సివాన్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చారు బీజేపీ ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్. కాగా, సివాన్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి లక్రినాబిగజ్కు వచ్చిన సిగ్రివాల్కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఎంపీ సహా ఆయనతోపాటు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులపై కుర్చీలతో దాడి చేశారు. చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా ఎవరూ తమకు సాయం చేయలేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ జనార్ధన్ సింగ్ సిగ్రివాల్ను కలిసి సమస్యలను వివరించినా ఫలితం లేదని ఆరోపించారు.
ఈ కారణంగానే దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 23 మంది మరణించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పలువురు నిరాశ్రయులయ్యారు. పంటపొలాలు వరదనీటిలో మునిగిపోవడంతో రైతులకు భారీగానే నష్టం వచ్చింది. సుమారు 74లక్షల మందిపై భారీ వర్షాల కారణంగా నష్టపోయారు.