Bihar:బీహార్ లో మోదీకి నో చాన్స్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, రేణుదేవి, తారకిషోర్,40 ఏళ్లు చాలు, మోదీ !
పాట్నా/ న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ 2020 ఎన్నికల తరువాత అతి పెద్ద పార్టీకి అవతరించిన బీజేపీ ఆ రాష్ట్రంలో తన భాగస్వామి అయిన జేడీయూకు సీఎం పదవి ఇచ్చేసింది. బీహార్ సీఎంగా జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇంతకాలం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ మోదీ ఈ సారి డీసీఎం పదవికి దూరం అయ్యారు. బీహార్ లో ఈసారి రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులు తెరమీదకు వచ్చాయి. చాలా వెనుక బడిన వర్గాలకు చెందిన ఇద్దరు బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కాయి. అయితే ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవికి ఎవ్వరూ ఊహించని విధంగా ఓ మహిళకు బీజేపీ నాయకులు అవకాశం ఇస్తున్నారు. బీహార్ గవర్నర్ ను కలవడానికి జేడీయూ నేత నితీశ్ కుమార్ సోమవారం మద్యాహ్నం రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు.
Recommended Video
Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా': మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు !
మోదీకి చాలా అనుభవం
బీహార్ ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ కు ఎక్కువ అనుభవం ఉంది. 2005 నుంచి (2013-2017 మద్యకాలంలో మినహాయించి) ఇప్పటి వరకు సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే ఈసారి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవికి సుశీల్ కుమార్ మోదీ దూరం అయ్యారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి తప్పిపోయినా సుశీల్ కుమార్ మోదీకి కీలక పదవి దక్కే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే అది ఎంత వరకు నిజం అనే విషయం వేచిచూడాల్సిందే.
ఉప ముఖ్యమంత్రిగా మహిళకు చాన్స్
బీహార్ లోని కతిహార నియోజక వర్గం ఎమ్మెల్యే తార కిషోర్ ప్రసాద్ బీజేపీ శాసనసభా పక్షనేతగా ఎన్నిక అయ్యారు. బీహార్ లో మరో సీనియర్ ఎమ్మెల్యే అయిన రేణుదేవి బీజేపీ శాసనసభ పక్ష ఉపనేతగా ఎన్నిక అయ్యారు. తారకిషోర్ ప్రసాద్, రేణుదేవి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి రేణుదేవిని వరించింది.
నరేంద్ర మోదీ, అమిత్ షా లెక్కలు
బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా వెనకబడిన వర్గాలు, మహిళల ఓట్లు కీలకంగా మారాయని, వారి ఓట్లు బీజేపీ, జేడీయూకు పడ్డాయని వెలుగు చూసింది. అదే వెనుకబడిన వర్గాలకు చెందిన తార కిషోర్ ప్రసాద్, రేణుదేవిలను ఉప ముఖ్యమంత్రులు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల డిసైడ్ అయ్యారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
40 ఏళ్లు అవకాశం ఇచ్చారు
బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఇంతకాలం ప్రజలకు సేవ చేసిన సుశీల్ కుమార్ మోదీ ఇప్పుడు ఆ పదవికి దూరం అవుతున్నారు. గత 40 ఏళ్ల నుంచి తాను అనేక పదవుల్లో కొనసాగడానికి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇక ముందు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కచ్చితంగా నిర్వహిస్తాను ఇంతకాలం తనకు సహకరించిన బీజేపీ పెద్దలకుకు తాను ధన్యవాదులు చెబుతున్నాను అంటూ సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు.
మోదీకి కేంద్రంలో కీలక పదవి ?
తనకు ప్రాణం ఉన్నంతవరకు బీజేపీ కార్యకర్తగానే పని చేస్తానని సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. కీలకమైన శాఖ అప్పగించి సుశీల్ కుమార్ ను కేంద్ర మంత్రి చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద బీహార్ కు లో రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులు తెరమీదకు వచ్చాయి.