ఆమెకు పాతికేళ్లు.. అతడికి పదిహేనేళ్లు, పైగా వదిన .. అయినా పెళ్లిచేశారు, చివరికి..
పాట్నా: వయసులో తనకన్నా పదేళ్ల పెద్దది, ఇద్దరు పిల్లల తల్లి అయిన వదినతో బలవంతపు వివాహం చేయడంతో పాపం ఏం చేయాలో అర్థం కాక మరిది ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. పైగా ఇది బాల్య వివాహం. మరిది వయసు 15 ఏళ్లే.
బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. గయా జిల్లా వినోబానగర్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించారు.
ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న వదినతో వివాహం ఇష్టంలేకనే వరుడు సూసైడ్ చేసుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
బాధితుడి తండ్రి కథనం ప్రకారం... మహదేవ్ సోదరుడు సంతోష్ దాస్ గయా జిల్లాలోని ఓ సంస్థలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ 2013లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో నష్టపరిహారం కింద ఆ సంస్థ మహదేవ్ కుటుంబానికి రూ.80 వేలు చెల్లించింది.
అయితే ఆ మొత్తాన్ని సంతోష్ దాస్ భార్య అయిన రూబీదేవికి ఇవ్వాలని లేదంటే ఇంటి చిన్నకొడుకైన మహదేవ్తో ఆమెకు వివాహం జరిపించాలంటూ కోడలి తరుపు బంధువులు ఒత్తిడి చేశారు. మహదేవ్ తండ్రి దివ్యాంగుడు కావడంతో కుటుంబ పోషణను దృష్టిలో ఉంచుకుని వచ్చిన పరిహారం వారికి ఇవ్వలేక ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకున్నాడు.
దీంతో వయసులో పదేళ్లు పెద్దదైన అన్న భార్యతో మహదేవ్కు గ్రామస్థులు వివాహం జరిపించారు. కానీ వివాహమైన కొద్ది గంటలకే చిన్న కొడుకును కూడా పోగొట్టుకోవలసి వస్తుందని తాను ఊహించలేదంటూ మహదేవ్ తండ్రి రోదించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అది బాల్య వివాహం కూడా కావడం, చట్టరీత్యా బాల్య వివాహం నేరం కాబట్టి.. ఆ వివాహానికి హాజరైన 9 మంది బంధువులను కూడా అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది.