తలపై చేతులు పెట్టుకుని.. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీపై నితీశ్ కుమార్ రియాక్షన్ ఇదీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ విజయంపై బీహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ స్పందనను మీడియా కోరగా.. తలపై చేతులు పెట్టుకుని.. ప్రజలే బాసులు.. అని కామెంట్ చేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. బీజేపీ సిద్దాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నితీశ్ ఇలా స్పందించారు.
బీహార్ మిత్రపక్షాలతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,ఎల్జేపీలతో కలిసి జేడీయూ బరిలో దిగిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ.. ఒక్క స్థానంలోనూ గెలవలేదు. బీజేపీ తమ బీహార్ మిత్రపక్షాలను తీసుకొచ్చి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై పోటీ చేయించడం ఇదే తొలిసారి. అయితే బీజేపీ చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.
ప్రశాంత్ కిశోర్ను తొలగించిన నితీశ్..
ఢిల్లీ ఎన్నికల సమయంలోనే జేడీయూ ఉపాధ్యక్షుడు,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై నితీశ్ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. సీఏఏ విషయంలో పదేపదే తనను టార్గెట్ చేయడం,ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ తరుపున పనిచేయడం వంటి కారణాలతో ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. ప్రశాంత్ కిశోర్తో పాటు,జేడీయూ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మపై కూడా బహిష్కరణ వేటు వేశారు.
బీహార్పై ఆప్ కన్ను..?
ఆమ్ ఆద్మీ తాజా గెలుపుపై జేడీయూ బహిష్కృత నేత పవన్ వర్మ ప్రశంసలు గుప్పించారు. కేజ్రీవాల్ పాలన,పథకాలు ప్రజల మెప్పును పొందాయన్నారు. ఆమ్ ఆద్మీ పనితీరుకు తాను ముగ్దుడయ్యాను అని చెప్పారు. మరికొన్ని నెలల్లో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ వర్మ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పవన్ వర్మ ఆమ్ ఆద్మీలో చేరి బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీహార్ రాజకీయాల్లో తన పాత్ర ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో నిర్ణయిస్తానని పవన్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ బీహార్పై కూడా కన్నేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.