రాజీనామా వెనక్కి తీసుకోకుంటే సాముహిక ఆత్మహత్యలు తప్పవు: రాహుల్కు బీహర్ కార్యకర్తల అల్టిమేటం
పాట్నా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో .. వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువవుతుంది. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని చెట్టుకు ఉరేసుకునేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇక బీహర్లో ఒక అడుగు ముందుకేసిన నేతలు తామంతా సాముహికంగా ఆత్మహత్య చేసుకుంటామని అల్టిమేటం జారీచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు దాదాపు 4 నెలలు చీఫ్గా కొనసాగుతానని ప్రకటించి .. ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేసు కోసం వెళ్తే ..
లోక్సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో బీహర్ డిప్యూటీ సీఎం సుుశీల్ కుమార్ మోడీ పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసు విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఇవాళ పాట్నా వెళ్లారు. అయితే అక్కడ చిత్రంగా ఓ పోస్టర్ కనిపించింది. అందులో రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాసి ఉంది. అంతేకాదు రాజీనామాను వెనక్కి తీసుకోకుంటే తామంతా సాముహికంగా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అంతేకాదు తమ అధినేతకు గడువు కూడా ఇచ్చారు. ఈ నెల 11లోపు రాజీనామా డిషిషన్పై పునరాలోచించాలని, లేదంటే 12 మంది ఆత్మబలిదానం చేసుకుంటామని స్పష్టంచేశారు. ఆ ప్లెక్సీలో 12 మంది కాంగ్రెస్ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. తమ పార్టీ నేతలు ప్లెక్సీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తోంది.
మోడీ కామెంట్స్ ..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా అందరూ దొంగల ఇంటిపేరు మోడీ అని ఉంటుందని రాహుల్ నోరుజారారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోడీ, మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ పేర్లను ప్రస్తావించారు. అయితే దీనని బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సీరియస్గా తీసుకున్నారు. రాహుల్ తనపై కూడా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దీంతో పాట్నాలో పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసు విచారణ కోసం శనివారం రాహుల్ పాట్నా వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన పోస్టర్ కలకలం రేపింది.
నాకొద్దు ...
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. సీడబ్ల్యూసీ నేతలు, సీనియర్ నేతలు, సోనియా, ప్రియాంక గాంధీలు చెప్పినా రాహుల్ వినిపించుకోలేదు. వారి విజ్ఞప్తితో 4 నెలలు చీఫ్గా కొనసాగుతానని చెప్పి .. ఇటీవలే అధికారికంగా అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు రాహుల్. తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో అధ్యక్షుడికి బదులు .. కాంగ్రెస్ కార్యకర్తగా మార్చుకున్నారు. వివిధ వర్గాలు, కార్యకర్తల నుంచి వినతులు వస్తున్నా .. పాట్నాలో వెలిసిన పోస్టర్ మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.