అక్రమ సంబంధం: అందరూ చూస్తుండగా జంటను సజీవ దహనం చేశారు
గయ: బీహార్ రాష్ట్రంలోని గయలో మానవత్వం మంటగలిపిన సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి సజీవ దహనం చేశారు. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు.
అక్కడున్న గ్రామస్తులు ఏదో కార్యక్రమం జరుగుతున్నట్టు చూశారే తప్ప అడ్డుకోవడానికి గానీ, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు గానీ ముందుకు రాకపోవడం విచారకరం.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వివాహమై ముగ్గురు పిల్లలున్న సదరు వ్యక్తి తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు.
పంచాయతీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల ప్రకారమే బుధవారం ఈ శిక్షను అమలు చేశారు. బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ దారుణం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను వ్యతిరేకించలేదు, కనీసం పోలీసులకు తెలియజేయలేదు. పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు. కాగా, పంచాయతీ పెద్దల ఆదేశాల మేరకే ఇద్దరినీ హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.