లాలూ చిన్న కొడుకు సూపర్: పెద్దోడు అక్కడే
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడిగా ఆయన చిన్న కుమారుడు తేజస్వి ముందుకు దూసుకు వెళుతున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలు భుజాన వేసుకుని అధికారులతో కలిసి పని చేస్తున్నారు.
తేజస్వి పనితీరుతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి వర్గ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే బీహార్ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నితీశ్ కుమార్ క్యాబినేట్ లో రెండవ, మూడవ స్థానాలు అలంకరించిన తేజస్వి, తేజ్ ప్రతాప్ ల మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనుభవం లేని వారిని కీలకపదవుల్లో కుర్చోపెట్టారని రాజకీయ విశ్లేషకులు మండిపడ్డారు.
మొదటి సారి శాసన సభ్యుడు అయిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపణలు చేశారు. అయితే తేజస్వి తన పనితీరుతో దూసుకు వెలుతున్నాడు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి సమస్యలు పరిష్కరిస్తున్నారు.
తేజ్ ప్రతాప్ మాత్రం సిగ్గు పడుతూ పని చేస్తున్నాడని, తనకు అప్పగించిన ఆరోగ్య శాఖకు సమర్థవంతంగా న్యాయం చెయ్యలేదని రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయనకు పాస్ మార్కులు వెయ్యడానికి వారు భయపడుతున్నారు.
తేజస్వికి ప్రతిపక్షాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో తేజస్వి వివిధ అంశాలపై సమర్థవంతంగా మాట్లాడారు. తన ప్రతిభతో విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ వారసుడు తేజస్వి నే అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ అంటున్నారు.