ఆ 3పార్టీల వల్లే, అంచనా వేయలేకపోయాం: జైట్లీ
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో మహాకూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని, మూడు పార్టీలు(ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) మహా కూటమిగా ఏర్పడటంతోతో ఓటమి చెందామని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం సాయంత్రం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది.
ఈ సమావేశంలో బీహార్లో ఎన్డీయే ఓటమి, పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశానంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు.
‘ఎన్డీయే ఓటమిని అంగీకరిస్తున్నాం. అక్కడ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యలు మా ఓటమికి కారణం కాదు. రిజర్వేషన్లపై మా వైఖరి సరిగా ఉంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం మహా కూటమిలో మూడు పార్టీలు కలవడం వల్లే మేం ఓడిపోయాం' అని అన్నారు.
‘ప్రత్యర్థి పార్టీలు కావాలనే మాపై దుష్ప్రచారం చేశాయి మహా కూటమి బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయాం. బీహార్లో ఓడినా ఇంతకుముందు మూడు రాష్ట్రాల్లో గెలిచాం. బీహార్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు రెఫరెండం కాదు. బిజెపి నేతలు బాధ్యతగా మాట్లాడాలి' అని జైట్లీ పేర్కొన్నారు. అయితే బీహార్ ఓటమి బిజెపి చేపడుతున్న సంస్కరణలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.
ఆరెస్సెస్, అమిత్ షా వల్లే ఓడాం: మాంఝీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దారుణ పరాభవానికి కారణం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షానేనని మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జీతన్రామ్ మాంఝీ ఆరోపించారు.
దళితులు, ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాపై సమీక్ష జరుపాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఎన్డీయే విజయావకాశాలను దెబ్బతీశాయన్నారు. ఆయన వ్యాఖ్యలను ప్రధానాంశంగా చేసుకొని మహాకూటమి ప్రచారం జరిపిందని మాంఝీ పేర్కొన్నారు.
అదేవిధంగా బిజెపి ఓడిపోతే పాకిస్థాన్లో టపాసులు పేలుతాయని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, ఈ వ్యాఖ్యలు మహాకూటమికే లబ్ధి చేకూర్చాయని ఆయన చెప్పారు. కాగా, ఎన్డీయే కూటమిలో భాగంగా 20 స్థానాల్లో పోటీచేసిన హెచ్ఏఎం కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది.