"బీహార్ ఐన్స్టీన్": వశిష్టనారాయణ్ సింగ్ ఇకలేరు.. ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన ఘనాపాటీ
మేధావి, బీహార్ ఐన్స్టీన్గా పిలువబడే వశిష్ట నారాయణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పాట్నా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే నారాయణ్ సింగ్ మృతదేహంను ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక కుటుంబసభ్యులు రెండు గంటల పాటు వేచిచూడాల్సి వచ్చింది.
వశిష్ట నారాయణ్ సింగ్ కుటుంబ సభ్యులకు అవమానం
వశిష్ట నారాయణ్ సింగ్ గురువారం చివరి శ్వాస విడిచారు. అయితే ఆయన మృతదేహంను ఇంటికి తరలించేందుకు గంటల పాటు హాస్పిటల్ ఆవరణలోనే వేచిచూడాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. బీహార్లో ఇలాంటి పరిస్థితి ఒక్క వశిష్ట నారాయణ్ కుటుంబ సభ్యులకే ఎదురుకాలేదని , ఎంతోమంది అంబులెన్స్ లేక మృతదేహాలను ఇంటివరకు మోసుకెళుతున్నారని ఆర్జేడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమీ ప్రత్యేక ఏర్పాట్లు కోరుకోవడం లేదని ఒక మనిషి మృతి చెందితే కనీసం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించింది.
నారాయణ్ సింగ్కు అవమానామా..?
వశిష్ట నారాయణ్ సింగ్ అపరమేధావి అని కొనియాడిన ఆర్జేడీ అతని మేదస్సు ముందు ప్రపంచం మోకరిల్లిందని గుర్తుచేసింది. భారత గడ్డపై పుట్టిన ఇలాంటి మేధావులక మనం ఇచ్చే బహుమానం ఇదేనా అని నిప్పులు చెరిగారు ఆమ్ఆద్మీ పార్టీ నేత ప్రముఖ కవి కుమార్ విశ్వాస్. ఇదిలా ఉంటే వశిష్ట నారాయణ్ మృతి యావత్ దేశానికి తీరని లోటు అని సీఎం నితీష్ కుమార్ అన్నారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాదు నారాయణ్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్పారు.
ఐన్స్టీన్ సిద్ధాంతంను సవాల్ చేసిన నారాయణ్ సింగ్
ఐన్స్టీన్ సిద్ధాంతం తప్పని చాటారు వశిష్ట నారాయణ్ సింగ్. 1942 ఏప్రిల్ 12న ఆయన జన్మించారు. గత 40 ఏళ్లుగా నారాయణ్ స్కీజోఫ్రీనియా జబ్బుతో బాధపడుతున్నాడు. గత నెలలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో పాట్నా మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో వశిష్ట నారాయణ్ సింగ్ తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత పాట్నా సైన్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించి, 1965లో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదివి పీహెచ్డీ 1969లో కంప్లీట్ చేశారు. సైకిల్ వెక్టార్ స్పేస్లో నారాయణ్ సింగ్ పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐటీ కాన్పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు బోధన చేశారు. బీఎన్ మండల్ యూనివర్శిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు.