Bihar assembly election 2020:5 సీట్లలో ఆ పార్టీ నేతలకే పట్టం.. ఏళ్లుగా మారని తీర్పు, కంచుకోటలు
బీహర్ ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరుగుతోంది. అందులో ముఖ్యమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ప్రధాన పార్టీల కంచుకోటలు.. గత 30 ఏళ్లుగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తోన్నారు. తర్వాత అధికారం చేపట్టడంతో ప్రభుత్వంలో మంత్రి పదవీ కూడా స్వీకరిస్తున్నారు. ఆ ఐదు నియోజకవర్గాలు గయా, దినారా, కహల్గావ్, మొకామా, లఖిసరాయ్ గురించి తెలుసుకుందాం పదండి.
బీజేపీ కంచుకోట.
గయా.. బీహర్లో నియోజకవర్గం.. గత 30 ఏళ్లుగా ఇక్కడ బీజేపీ గెలుస్తూ వస్తోంది. బీహర్ వ్యవసాయశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడినుంచి వరసగా ఆరుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన ప్రతీసారి మంత్రి పదవీ చేపడుతున్నారు.
జేడీయూకే పట్టం
దినారా.. ఇక్కడినుంచి జేడీయూకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జై కుమార్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరసగా రెండుసార్లు ఆయన విజయం సాధించి.. హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఎల్జేపీ నుంచి రాజేంద్ర సింగ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన 2600 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
హస్తమే నేస్తం..
కహల్గావ్.. ఇదీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడి నుంచి 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీహర్ రాష్ట్ర చీఫ్ సదానంద్ సింగ్ 9 సార్లు వరసగా విజయం పొందారు. 2015లో ప్రత్యర్థి ఎల్జేపీ నీరాజ్ కుమార్పై 20 వేల ఓట్లతో విజయం సాధించారు. 1977లో దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీశాయి. మహామహాులు మట్టికరచిపోయారు. కానీ సదానంద్ సింగ్ మాత్రం గెలిచారు.
లోకల్ ఫీలింగ్..
మోకామా.. ఈ నియోజకవర్గం స్ధానికంగా పట్టు ఉన్న అనంత్ సింగ్, అతని కుటుంబ సభ్యులు గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ భూమిహర్, యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉండటంతో వారి విజయం నల్లేరు మీద నడక అవుతోంది. ప్రస్తుతం ఆర్జేడీ నుంచి అనంత్ సింగ్ బరిలో ఉన్నారు. 2005 నుంచి 2010 వరకు జేడీయూ నుంచి సింగ్ పోటీ చేసి.. గెలిచారు. కానీ 2015లో జేడీయూ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. 1990లలో సింగ్ సోదరుడు దిలీప్ ఇన్నడినుంచి జేడీయూ నుంచి పోటీ చేసి.. నాలుగు పర్యాయాలు గెలుపొందారు.
కమల వికాసమే
లఖిసరాయ్..ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి గెలుచుకుంటూ వస్తోన్నారు. బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటోంది. కార్మికశాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా రెండుసార్లు ఇక్కడినుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి రామానంద్ మండల్తో తీవ్ర పోటీ నెలకొంది. కానీ చివరకు సిన్హా గెలుపొందారు.