రామమందిర మంత్రం పని చేయదిక: ఈ సారి సీతమ్మ తల్లి ఆలయం: అయోధ్యను మించి: కొత్త నినాదం
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరగడం ఆరంభించింది. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ రామమందిరం నినాదాన్ని తెరమీదికి తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇక రామమందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఆ మంత్రం పనిచేయదని భావిస్తున్నారు బిహార్ రాజకీయ నేతలు. అందుకే- ఈ సారి సీతమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు. మందిర నిర్మాణాలంటే మొట్టమొదటగా గుర్తుకొచ్చే పార్టీ.. బీజేపీ. ఆ పార్టీ నేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నారో ఏమో.. లోక్జనశక్తి పార్టీ సీతమ్మ తల్లికి గుడి కడతామనే నినాదాన్ని తీసుకొచ్చింది.
అయోధ్యలో నిర్మితమౌతోన్న రామమందిరానికి మించిన స్థాయిలో సీతమ్మ తల్లికి ఆలయాన్ని కట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తామంటూ లోక్జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆలయ నిర్మాణ పనులను చేపడతామని ప్రకటించారు. బిహార్లోని సీతామర్హిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తామని చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇదివరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఎల్జేపీ.. ఈ సారి తన వ్యూహాన్ని మార్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తోంది. బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. దీనితో అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలపై కన్నేసింది. అందుకే- బీజేపీ ఓటుబ్యాంకును సైతం ప్రభావితం చేసేలా సీతమ్మకు ఆలయాన్ని నిర్మిస్తామనే నినాదాన్ని ఎత్తుకుందా పార్టీ.
బిహార్లోని సీతామర్హిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తామని చిరాగ్ పాశ్వాన్ హామీ ఇచ్చారు. సీతమ్మ లేనిదే శ్రీరాముడు లేడని, అందుకే- ఆ తల్లి పేరు మీద తాము భారీ ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్నారు. రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభలో ప్రసంగించారు. సీతామర్హిలోని పునౌరా మందిర్ను సందర్శించారు. సీతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదే ప్రదేశంలో అయోధ్య రామాలయాన్ని మించిన స్థాయిలో గుడిని కట్టే ప్రతిపాదనలు ఉన్నాయన చిరాగ్ పాశ్వాన్ చెప్పారు.