Bihar: బీహార్ లో అతి పెద్ద చెత్త పార్టీ కాంగ్రెస్,పొడిచేస్తుంది అనుకుంటే మా చీటి చింపేసింది, గోవింద!
పాట్నా/ బీహార్/ న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొడిచేస్తుంది అనుకుంటే మాకిందకే నీళ్లు తెచ్చిందని, మా చీటి చింపేసిందని ఆ పార్టీ మిత్రపక్షాలు తలలు పట్టుకున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెత్త ప్రదర్శనతో అధికారానికి దూరం అయ్యామని కొందరు ఆర్ జేడీ నాయకులు రగిలిపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని అనుకుంటే మాకు మూడు నామాలు పెట్టేసిందని ఆర్ జేడీ నాయకులు మండిపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 51 నియోజక వర్గాల్లో చెత్తచెత్తగా ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు.
Bihar: MGB అంటే మహాఘట్ బంధన్ కాదు 'మర్ గయా భయ్యా': మీరు ఫినిష్, కేంద్ర మంత్రి జోకులు!
పొడిచేస్తామని ఎగిరిపడిన కాంగ్రెస్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పొడిచేస్తాం అంటూ కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరిపడ్డారు. ఆర్ జేడీ, వామపక్షాల నాయకులతో పోట్లాడి ఏకంగా 70 సీట్లలో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. అయితే 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం 30 సీట్లలో విజయం సాధిస్తుందని ఆర్ జేడీ, వామపక్షాల నాయకులు అంచనాలు వేశారు. పైకి పొడిచేస్తాం అంటూ ఎగిరెగిరిపడిన కాంగ్రెస్ నాయకులు చివరికి మా గుండెల్లో పొడిచేశారని ఇప్పుడు ఆర్ జేడీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోడీతో రాహుల్, ప్రియాంక పోటీ నా ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ జోరుగా ప్రచారం చేశారు. బీహార్ లో మూలమూలకు తిరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ మీరు నితీశ్ కుమార్ ను సీఎం చెయ్యాలని ఓటర్లకు మనవి చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం తూతూ మంత్రంగా బీహార్ లో ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు మనవి చేశారు. ఇక బీహార్ నాయకులను పూర్తిగా పక్కన పెట్టేసిన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ టీమ్ ఏర్పాటు చేసిన ఒకటి రెండు బహిరంగ సమావేశాలకు మాత్రమే హాజరై ప్రచారం చేశారని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మా ఖర్మ..... అనుభవిస్తున్నాము
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదో చించేస్తుంది, పొడిచేస్తుంది అనుకుంటే మమ్మల్ని ఏకంగా ముంచేసిందని ఆర్ జేడీ, వామపక్షాల నాయకులు అంటున్నారు. ఎన్డీఏ అభ్యర్థులు, పలు నియోజక వర్గాల్లో జేడీయూ అభ్యర్థులు విజయం సాధించడానికి అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల నిర్లక్షం కారణం అని CPI (ML) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. ఏం చేద్దాం, కాంగ్రెస్ ను నమ్ముకున్నందుకు జరగరానిది జరిగిపోయింది, అంతా మా ఖర్మ అంటూ వామపక్షాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
చేతులు ఎత్తేసిన గాంధీలు
మధ్యప్రదేశ్ లో 27 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 19 నియోజక వర్గాల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. మద్యప్రదేశ్ లో మిగిలిన శాసన సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి ఆ రాష్ట్రంలోని కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ తదితర నాయకులు శ్రమించారని, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి గాంధీలు (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు) పెద్దగా ఆసక్తి చూపించలేదని ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందని ఆ పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.