ఏడు కోట్లమంది ఎవరిని ఎన్నుకున్నారో: సైలెంట్ ఫోర్స్: మహిళలు, యువత ఓటుబ్యాంకే కీలకం
పాట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 7తో ముగిశాయి. అదే రోజున ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ సారి బిహార్ను ఏలేది ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమే అని తేల్చేశాయి. ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణస్వీకారం చేయడమే మిగిలిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమౌతాయా? ప్రజల నిర్ణయాధికారాన్ని అవి ప్రస్ఫూటింపజేశాయా? వాస్తవ పరిస్థితులు ఏమిటనేది తేలిపోనుంది.
Recommended Video
టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్
అగ్ర నేతలు పాగా..
ఈ సారి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలను నిర్వహించారా. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ఇతర అగ్రనేతలు ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. ఎన్నికలకు ఒక్క రోజు ముందు అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తిరిగి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ప్రజలకు లేఖ రాశారు.
ఏడు కోట్ల మంది..
ఈ ఎన్నికల్లో 7,29,27,396 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 63 శాతం మంది ఓటర్లు ఈ సారి మార్పును కోరుకున్నారని ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. ఒకట్రెండ్ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల ప్రకారం..బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటమంటూ జరిగితే చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన్శక్తి పార్టీ కింగ్ మేకర్గా అవతరించే అవకాశాలు లేకపోలేదు. అతి తక్కువ సీట్లకే ఎల్జేపీ పరిమితమౌతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ కొద్దిమేర సీట్లను సాధించిన ఎల్జేపీ.. ఎవరికి మద్దతు ఇస్తే.. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశాలనూ కొట్టి పారేయట్లేదు విశ్లేషకులు.
పార్టీల సీట్లు ఇలా..
అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)115, భారతీయ జనతా పార్టీ-110, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ-11, జీతన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-7 స్థానాలకు పోటీ చేశాయి. ప్రతిపక్షం నుంచి రాష్ట్రీయ జనతాదళ్-115, కాంగ్రెస్-70, సీపీఐ-ఎంఎల్-19, సీపీఐ-6, సీపీఐఎం-4 సీట్లల్లో పోటీ చేశాయి. ఆర్జేడీ సారథ్యంలో ఆయా పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఏడుకోట్ల మంది బిహారీయులు ఈ పార్టీల్లో ఎవరిని ఎన్నుకున్నారనేది ఇంకాసేపట్లో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవ రూపాన్ని దాల్చితే.. తేజస్వి యాదవ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మహిళలు, యువత ఓటు బ్యాంకు కీలకం..
మహిళలు, యువత ఓటు బ్యాంకు ఈ సారి కీలకంగా మారింది. చాపకింద నీరులా మహిళలు జేడీయూకు ఓటు వేశారని అంటున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున తేజస్వి యాదవ్కు అండగా నిలిచారనే అంచనాలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పట్టి పీడుస్తోన్న ప్రస్తుత పరిస్థితులు యువత తేజస్విపై ఆశలు పెట్టుకుందని, దానికి అనుగుణంగా మహాకూటమికి ఓటు వేసిందని అభిప్రాయపపడుతున్నారు. అవన్నీ వాస్తవ రూపాన్ని దాల్చుతాయా? లేదా? అనేది తేలిపోనుంది.