మాజీ ముఖ్యమంత్రికి పరాభవం తప్పనట్టే? వెనుకంజ: ఆధిక్యతలో మాజీ స్పీకర్
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు కీలక అభ్యర్థులు ఓటమి బాటలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వాన్ని వహిస్తోన్న మహాకూటమిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గెలిచి తీరుతారనుకుంటోన్న అభ్యర్థులకు పరాజయం తప్పదనిపించేలా కనిపిస్తోంది.
బీజేపీ సర్కార్..బేఫికర్: ఆధిక్యత: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసినా: సింధియా మంత్రాంగం
ఇదే క్రమంలో- మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ వెనుకంజలో ఉన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి ఆయనపై భారీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్, రౌండ్కూ ఆధిక్యత పెరుగుతోంది. హిందుస్తానీ ఆవామీ మోర్చా పార్టీని స్థాపించిన జీతన్ రామ్ మాంఝీ.. జేడీయూ-బీజేపీలతో కలిసి పోటీ చేస్తున్నారు. ఇమామ్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిల్చున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఇదివరకు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఆ తరువాత నియోజకవర్గాన్ని వీడారు.
మళ్లీ తన సొంత పార్టీ హిందుస్తాన్ ఆవామ్ మోర్చా తరఫున 2015 ఎన్నికల్లో ఇమామ్ గంజ్ నుంచే పోటీకి దిగారు. విజయం సాధించారు. ఈ సారి ఫలితం ప్రతికూలంగా వెలువడుతోంది. ఆర్జేడీకి చెందిన ఉదయ్ నారాయణ్ చౌధురి ఆయనపై ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఆర్జేడీకి పెట్టని కోట. ఉదయ్ నారాయణ్ సింగ్ 2015కు ముందు ఈ స్థానం నుంచి నాలుగు సార్లు గెలుపొందారు. ఈ సారి మళ్లీ గెలిచేలా కనిపిస్తున్నారు.
Recommended Video
కాగా- ఈ ఎన్నికల సందర్భంగా బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు దాదాపు ఖాయమైనట్టే ఉన్నాయి. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సభ్యుల సంఖ్య అవసరం అవుతుంది. ఈ మేజిక్ ఫిగర్ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ సాధించినా అది బొటాబొటీగానే మారుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం.. ఎన్డీఏ, మహకూటమి అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. ఎన్డీఏదే ఒకింత పైచేయిలా కనిపిస్తోంది.