బీహార్ ఫలితాల్లో ఎన్డీయే స్వల్ప ఆధిక్యం- ఆర్జేడీ మినహా రాణీంచని మిత్రపక్షాలు..
బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో ఆర్జేడీ హవా కొనసాగింది. కొద్ది సేపటి క్రితం సాధారణ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇందులో మహాకూటమి, ఎన్డీయే పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఇరు కూటములూ చెరో 110కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందులో ఆర్జేడీ అత్యధికంగా 68 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కూటముల పరంగా చూసుకుంటే మాత్రం ఎన్డీయే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో పోలిస్తే ఎన్డీయే స్వల్ప ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. తాజా ఫలితాల ప్రకారం ఎన్డీయే 124 సీట్లలోనూ, మహాకూటమి 110 సీట్లలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్ అసెంబ్లీలో అధికారం సాధించాలంటే 122 సీట్ల మ్యాజిక్ మార్క్ అందుకోవాల్సి ఉంటుంది.
ఇటు దుబ్బాక... అటు బిహార్... నేడే ఎన్నికల ఫలితాలు... ఓటరు దేవుడు ఎవరివైపు...
తాజా ఆధిక్యాలు గమనిస్తే అత్యధికంగా 68 స్ధానాల్లో ఆర్జేడీ, 63 స్ధానాల్లో బీజేపీ, 57 స్ధానాల్లో జేడీయూ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాకూటమి పార్టీల్లో కాంగ్రెస్ 24 స్ధానాల్లో, సీపీఎంఎల్ఎల్ 11 స్ధానాల్లో, సీపీఎం 3 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరుల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి పార్టీ మూడు స్ధానాల్లో మాత్రమే ఆధిక్యం కొనసాగిస్తోంది. మరో 9 చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు లీడ్లో ఉన్నారు.
Recommended Video
ఇక మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వి యాదవ్ రాఘోపూర్ స్ధానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు. హసన్పూర్లో ఆయన సోదరుడు తేజ్ప్రతాప్ యాదవ్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. హెచ్ఏఎం పార్టీ నేత జీతన్ రామ్ మాంఝీ ఇమాంగంజ్లో ఆధిక్యంలో ఉన్నారు. ముజఫర్పూర్లో బీజేపీ నేత సురేశ్ కుమార్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ అభ్యర్దులు వెనుకబడటం మహాకూటమి విజయావకాశాలను ప్రభావితం చేసేలా కనిపిస్తోంది.