కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్: కొండను ఢీ: ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పీటముడి: ఎవరో తేలకుండానే
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్ సమాయాత్తమౌతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణం నుంచే బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు, పొత్తుల ఎత్తులు జోరందుకున్నాయి. బిహార్లో బలంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) కూటమిని దెబ్బతీయడానికి ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలోని కూటమి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి అసెంబ్లీలో పాగా వేయాలనే లక్ష్యంతో ఆర్జేడీ కూటమి నేతలు ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
బలమైన ప్రత్యర్థిని ఢీ కొట్టేలా..
అత్యంత బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఢీ కొట్టాలీ అంటే.. దానికి అనుగుణంగా ప్లానింగ్ ఉండాలి. దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అన్నింటి కంటే ముందు- తనతో వచ్చే పార్టీలను కలుపుకొని పోవాలి. మిత్రపక్షాన్ని బలోపేతం చేసుకోవాలి. ఐక్యంగా ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. ఆర్జేడీ కూటమి పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తోంది. జేడీయూ కూటమిని ఎదుర్కొనడంలో ఆర్జేడీ మల్లగుల్లాలు పడుతోంది. ఆదిలోనే తడబడుతోంది.
తేజస్వి అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు..
ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్-రాష్ట్రీయ లోక్సమతా పార్టీ-కాంగ్రెస్ కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బిహార్ రాజకీయాల్లో తలపండిన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కేసులతో తెరమరుగైన తరువాత.. ఆ స్థాయి నాయకుడు ప్రస్తుతం కనిపించట్లేదు. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అభ్యంతరాలూ వ్యక్తమౌతున్నాయి. తేజస్వి యాదవ్ను తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి రాష్ట్రీయ లోక్సమతా పార్టీ అంగీకరించట్లేదు. తేజస్వి అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇవ్వబోమనీ చెబుతున్నారు.
తేజస్వి వైపే..
రాష్ట్రీయ జనతాదళ్ నేతలు మాత్రం తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశాయి. ఈ కూటమి నేతగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆయనే ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకుంటారనే సంకేతాలను ఆర్జేడీ నాయకులు ఇప్పటికే పంపించారు. తేజస్వి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్కు పెద్దగా అభ్యంతరాలు లేవు. అయినప్పటికీ- రాష్ట్రీయ లోక్సమతా పార్టీ నేతలు ఆయనకు మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి తేలకుండానే..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందుగా ప్రకటించకుండానే ఎన్నికల బరిలో దిగే అవకాశాలు లేకపోలేదని బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శక్తిసింగ్ గోహిల్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వెల్లడించకుండానే తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అన్నారు. కూటమిలోని ప్రతి పార్టీకీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే హక్కు ఉందని, దాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదనీ స్పష్టం చేశారు. 2015 ఎన్నికల్లో తాము మెరుగైన ఫలితాలను సాధించామని, ఈ సారి తమ ఓటుబ్యాంకును మరింత మెరుగుపర్చుకుంటామని చెప్పారు.
Recommended Video
కేంద్రమాజీమంత్రికి గాలం
ఇదిలావుండగా.. కేంద్రం నుంచి బయటికి వచ్చిన ఉపేంద్ర కుష్వాహాను గాలం వేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రీయ లోక్సమతా పార్టీ నేత కుష్వాహా.. కేంద్ర సహాయమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్జేడీ కూటమి నాయకత్వాన్ని మార్చగలిగితే.. తాను అందులో చేరుతానని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆర్జేడీ సారథ్యాన్ని వహిస్తోన్న కూటమి.. సారథ్య బాధ్యతల నుంచి ఎలా తప్పుకొంటుందనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. లోక్సమతా పార్టీ ఈ కూటమిలో చేరితే.. ఓటుబ్యాంకు మరింత బలపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.