బీహార్లో గెలుపెవరిది... సీఎంగా జనం ఎవరిని కోరుకుంటున్నారు.. టైమ్స్ నౌ-సీఓటర్ సర్వేలో ఏం తేలింది...
బీహార్లో ఈసారి గెలుపెవరిది... మహాకూటమి వర్సెస్ ఎన్డీయే కూటమిలో విజయం ఎవరిని వరించబోతుంది... ఈ ప్రశ్నలకు టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమే విక్టరీ కొట్టబోతున్నట్లు తెలిపింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఎన్డీయేకి 160 స్థానాలు,యూపీఏ మహాకూటమికి 76 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. 143 సీట్లలో పోటీ చేయబోతున్న లోక్ జనశక్తి పార్టీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది.
Recommended Video
బీహార్ సిత్రాలు- లాలూ వైఫల్యాలే నితీశ్ అస్త్రాలు- తన విజయాల్ని పక్కనబెట్టి...
ఏ పార్టీకి ఎన్ని సీట్లు...
రాష్ట్రంలో బీజేపీ 85 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని... ఆ తర్వాత 75 సీట్లతో జేడీయూ రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని తెలిపింది. బీజేపీ,జేడీయూని మినహాయిస్తే ఎన్డీయేలో మిగతా మిత్రపక్షాలకు ఐదు సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. మహాకూటమిలో ఆర్జేడీకి 56 సీట్లు,కాంగ్రెస్కు 15,వామపక్షాలకు 5 సీట్లు దక్కుతాయని తెలిపింది. మొత్తంగా మహాకూటమి 76 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది.
సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు...?
ఇక సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు అత్యధికంగా నితీశ్ కుమార్ వైపే ఎక్కువమంది మొగ్గుచూపారు. దాదాపు 32శాతం మంది ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. నితీశ్ పనితనం విషయానికొస్తే... 28.7శాతం మంది బాగుందని,29.2శాతం మంది యావరేజ్ అని,42శాతం మంది ఏమాత్రం బాగోలేదని వెల్లడించారు. మహాకూటమి సీఎం అభ్యర్థి,ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను 17శాతం మంది సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ను 8శాతం మంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను 8శాతం మంది,బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీని 12.5శాతం మంది సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యేంటి...?
బీహార్ ఎన్నికల్లో నిరుద్యోగ అంశమే కీలకంగా మారబోతున్నట్లు సర్వే వెల్లడించింది. బీహార్లో ఇప్పుడున్న అతి ముఖ్యమైన సమస్యేంటి అన్న ప్రశ్నకు 51.16శాతం మంది నిరుద్యోగమే అని అభిప్రాయపడ్డారు. మరో 12.61శాతం మంది కరోనా వైరస్తో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పారు. 7.43శాతం మంది అవినీతి పెద్ద సమస్యగా మారిందని... మరో 28.83శాతం మంది ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
సర్వే జరిగిందిలా...
తాజా టైమ్స్ నౌ-సీఓటర్ సర్వేను అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 మధ్యలో నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 12,843 మంది అభిప్రాయాలను సేకరించారు. కంప్యూటర్,టెలిఫోన్ ద్వారా బీహార్లోని మొత్తం 243 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. సర్వే ఫలితాల్లో ఎర్రర్ను ప్లస్ లేదా మైనస్ 3గా చూడవచ్చునని పేర్కొన్నారు.