బీహార్ ఎన్నికలు: తుది దశ పోలింగ్ వేళ విషాదం .. బెనిపట్టి అభ్యర్థి నీరజ్ ఝా కరోనాతో మృతి
బీహార్ లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . బీహార్ లో ఈ రోజు జరుగుతున్న ఫైనల్ వార్ లో 78 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది . ఈసమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మధుబనిలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా కరోనా వైరస్ కారణంగా మరణించారు. గత కొద్ది రోజులుగా నీరజ్ ఝా కరోనా బారిన పడ్డాడు . ఆయన పాట్నా ఎయిమ్స్లో చికిత్స నిమిత్తం చేరారు .
Recommended Video
ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నీరజ్ ఝా కరోనాతో కన్నుమూత
నీరజ్ ఝా జెడియు నాయకుడు, కానీ ఎన్నికలకు ముందు పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలోకి దిగారు . మీడియా నివేదికల ప్రకారం, ఎన్నికల పోటీలోకి దిగిన రోజున స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా అనారోగ్యంతో ఉన్నారు. కానీ ఆయన మందులను వేసుకుంటూ ప్రచారం కొనసాగించాడు. ఆరోగ్యం క్షీణించినందుకు పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది . ఆ తర్వాత చికిత్స కోసం మధుబనికి మొదట తీసుకువచ్చారు. ఆయన పరిస్థితి విషమంగా మారటంతో పాట్నా ఎయిమ్స్లో చేర్చారు. చివరకు ఆయన నేడు తుది శ్వాస విడిచారు .
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నీరజ్ ఝా
నీరజ్ ఝా తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐతో ప్రారంభించారు. నీరజ్ 2004 నుండి 2008 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా కూడా పని చేశారు . 2012 లో జెడియులో చేరారు, అక్కడ 2015 నుండి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికలలో టికెట్ రాకపోవడంతో నీరజ్ ఝా జెడియు నుంచి వైదొలిగారు.
జేడీయూ నుండి బయటకు వచ్చాక స్వతంత్రంగా ఎన్నికల్లో
జెడియు నుంచి వైదొలిగిన తరువాత స్వతంత్ర అభ్యర్థిగా మధుబని జిల్లాలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో నీరజ్ ఝా కు కరోనా సోకింది. 10 రోజులు చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మరణించాడు. బీహార్లో కరోనా కారణంగా ఇప్పటివరకు తొమ్మిది మంది నాయకులు మరణించారు. ఇటీవల, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు , అరియారియా జిల్లాలోని సిక్టీ విధానసభ అభ్యర్థి విజయ్ కుమార్ యాదవ్ కూడా కరోనా నుండి మరణించారు.