Bihar elections .. జంగిల్ రాజకుమారుడికి విశ్రాంతినివ్వండి ... తేజస్వి యాదవ్ టార్గెట్ గా జేపీ నడ్డా
బీహార్లో రెండవ దశ పోలింగ్ పూర్తికాగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. మరోసారి ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ పై విమర్శలు గుప్పించిన జేపీ నడ్డా జంగిల్ రాజ్యానికి రాకుమారుడైన తేజస్వి యాదవ్ కు విశ్రాంతినివ్వండి నితీష్ కుమార్ కు పని కల్పించండి అంటూ ప్రచారం చేశారు.
తేజస్వి యాదవ్ కుర్తా పట్టుకుని వేలాడినా ... విజయం ఎన్డీఏదే... కాంగ్రెస్ కు పీఎం మోడీ చురకలు
ప్రిన్స్ ఆఫ్ జంగిల్ రాజ్ ప్రజలను మోసం చేశారని విమర్శలు
ప్రిన్స్ ఆఫ్ జంగిల్ రాజ్ ప్రజలను మోసం చేశారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డ రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజశ్వి యాదవ్ పై దాడి చేశారు. లారియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ నడ్డా మాట్లాడుతూ నవంబర్ 7 న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడవ మరియు చివరి దశ పోలింగ్ జరుగుతుంది. నితీష్ నాయకత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు . ఎన్నికలలో మహా కూటమికి ఓటేస్తే బీహార్ ఆర్ధిక పరిస్థితి నాశనం అవుతుందని నడ్డా పేర్కొన్నారు .
కరోనా సమయంలో ఢిల్లీలో కూర్చుని ఇప్పుడు బీహార్ గురించి మాట్లాడతారా ?
తేజస్వి యాదవ్ ప్రతిపక్ష నాయకుడైన ప్పటికీ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రారని జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ భయంతో మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రాహుల్ గాంధీ, తేజశ్వి యాదవ్ ఇద్దరూ ఢిల్లీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు . కరోనా సమయంలో బీహార్లో ఏమి జరిగిందో చూడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహమ్మారి సమయంలో సిఎం నితీష్ కుమార్, బిజెపి కార్యకర్తలు మాత్రమే బీహార్ ప్రజలకు అండగా నిలిచారని జేపీ నడ్డా తెలిపారు.
తేజస్వి యాదవ్ వట్టి అబద్దాలకోరు
తేజశ్వి యాదవ్ మహా ఘట్ బంధన్ (గ్రాండ్ అలయన్స్) యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి కావడంతో ఆయన పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. తేజస్వి యాదవ్ అబద్ధాలు చెబుతున్నారు అంటూ మండి పడ్డారు జేపీ నడ్డా. ఇక బీహార్ రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు రౌండ్ల పోలింగ్ జరిగింది. మంగళవారం రెండో దశలో 54.64 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండవ దశలో 17 జిల్లాల్లో 94 స్థానాలలో పోలింగ్ జరిగింది.
చివరి దశ పోలింగ్ కోసం హోరాహోరీగా మాటల యుద్ధం
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం, 2015 ఎన్నికలలో ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతం 56.17 గా ఉంది.గవర్నర్ ఫగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, తేజశ్వి యాదవ్, శత్రుఘ్న సిన్హా, ఎల్జెపి అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్లతో సహా ప్రముఖ వ్యక్తులు తమ పోలింగ్ బూత్లలో మంగళవారం ఓట్లు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చివరి విడత ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా మాటల యుద్ధంలో తలపడుతున్నాయి. నవంబర్ 10 న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి.