కరోనా వల్ల ఎన్నికల వాయిదా కుదరదు - ఈసీని ఆదేశించలేం - బీహార్ పోల్స్పై సుప్రీం కోర్టు
ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్ ఉధృతి సరైన కారణం కాబోదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని తెలిపింది. కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్న బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు శుక్రవారం కొట్టేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం దేశంలో, లేదా ఆయా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఎన్నికలను వాయిదా వేయాలని రాసుందని, పైగా, బీహార్ లో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఈ సమయంలో ఎన్నికలు కరెక్టుకాదంటూ అవినాశ్ ఠాకూర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే వాయిదా కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం తొందరపాటు అవుతుందన్న ధర్మాసనం ఎన్నికలు నిర్వహించవద్దని ఈసీని ఆదేశించలేమని, ఎన్నికలు వాయిదాకు కోవిడ్ సరైన కారణం కాదని తేల్చిచెప్పింది. అయితే, ఈ వ్యవహారంలో తుది నిర్ణయం ప్రధాన ఎన్నికల కమిషనర్ దేనని, ఏం చేయాలో ఆయనకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం పిటిషన్ ను తిరస్కరించింది.
Recommended Video
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్ లో ఇప్పటివరకు 1.28లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 662 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1.09మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసులు 18,491 గా ఉన్నాయి.