బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదల
బీహార్ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్, ఆర్జెడి, వామపక్ష పార్టీలు మహా కూటమి భాగస్వామ్య పార్టీలు శనివారం తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. తమ కూటమి ఎన్నికల్లో గెలిస్తే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుల పైనే మొదటి సంతకం ఉంటుందని మహాకూటమి స్పష్టం చేసింది.
Recommended Video
యువత ఉద్యోగాల కల్పనకు పెద్ద పీట
యువత ఉద్యోగాల కల్పనను కూడా ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రస్తావించింది. ఈ ఎన్నికల్లో పోటీ పడడానికి, ప్రత్యర్థి పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్, ఆర్జేడీ ,వామపక్ష పార్టీలు ఇప్పటికే సీట్ల సర్దుబాట్లు కూడా చేసిందనేది తెలిసిన విషయమే. మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా మాట్లాడుతూ, వారు ఎన్నికలలో గెలిస్తే, ఆర్జెడి తేజశ్వి యాదవ్ నాయకత్వంలో, గత నెలలో కేంద్రం రైతులకు నష్టం చేసేలా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే రద్దు చేస్తామని పేర్కొన్నారు.
కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాలను రద్దు .. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం
బీజేపీ 3 పొత్తులతో కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకటి ప్రజలందరికీ కనిపించే జనతాదళ్ యునైటెడ్ తో, రెండవది జనశక్తి పార్టీతో , అలాగే మూడవది ఓవైసీ సాహెబ్ తో అంటూ ఎద్దేవా చేశారు. విపక్షాల నుంచి ఎదురైన వ్యతిరేకతను దాటుకుని గత నెల కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాల పై దేశ వ్యాప్తంగా రైతుల నుండి నిరసనలు మిన్నుముట్టాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు నష్టం కలిగేలా కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని మహా కూటమి పేర్కొంది. ఇదే మెయిన్ టార్గెట్ గా ప్రచార పర్వంలో ముందుకు వెళ్లనుంది .
కేంద్రం కుర్చీ కోసమే పోటీ పడుతుందని తేజస్వి యాదవ్ ఆగ్రహం
మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ కేంద్రం కుర్చీ కోసమే పోటీ పడుతోందని, వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటివరకూ కేంద్ర బృందం పర్యటించిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఇక ప్రజలకు సేవ చేయడమే తమ పని అని గొప్పలు చెప్పుకుంటారు అని మండిపడ్డారు. ఇటీవల కూటమి భాగస్వాముల బీహార్ అసెంబ్లీలోనూ 243 సీట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. బీహార్ ఎన్నికల క్షేత్రంలోకి సమరోత్సాహంతో ముందుకు వెళుతున్నారు.
బీహార్ ఎన్నికలు ... రసవత్తర రాజకీయం
మరోపక్క బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు అని తెలుస్తోంది. బీహార్లో ఆయన మొత్తం 12 ర్యాలీలలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకున్న ఇమేజ్ బీహార్ ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మహాకూటమి కూడా ఏకతాటి మీద బీజేపీపై సమరానికి సిద్ధంగా ఉంది. దీంతో బీహార్ లో ఎన్నికల వేడి మరింత పెరిగి రాజకీయం రసవత్తరంగా మారింది. బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు నవంబర్ 10వ తేదీన ప్రకటించబడతాయి.