దసరాకు మోడీ, అంబానీ, అదానీ బొమ్మల దగ్దం: పష్చిమ్ చంపార్ ర్యాలీలో రాహుల్ గాంధీ ధ్వజం
బీహర్ ప్రచార పర్వంలో నేతలు దూసుకెళ్తున్నారు. వచ్చే నెల 3వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. విపక్షాలపై మోడీ విరుచుకుపడగా.. రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. పష్చిమ్ చంపారన్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం నితీశ్ కుమార్పై మండిపడ్డారు.
రాష్ట్రాభివృద్దిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను విస్మరించాయని రాహుల్ ధ్వజమెత్తారు. సాధారణంగా దసరా సందర్భంగా రావణ బొమ్మలను దగ్దం చేస్తారు.. కానీ ఈ సారి పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మను తగులబెట్టారని రాహుల్ గుర్తుచేశారు. మోడీతోపాటు అంబానీ, అదానీ బొమ్మలను కూడా దగ్దం చేశారని తెలిపారు. ఎందుకు దహనం చేశారో అందరికీ తెలుసు అని చెప్పారు. మోడీతో వారు కుమ్మక్కయ్యారని అందరికీ తెలుసు అని చెప్పారు.
బీహర్లో నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగాలు కల్పించడం లేదు. సరైన మౌలిక వసతులు లేవని రాహుల్ గుర్తుచేశారు. ఇదీ ప్రజల తప్పు కాదు.. సీఎం నితీశ్, ప్రధాని మోడీ అని రాహుల్ గాంధీ అన్నారు. బీహరీల ప్రయోజనాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. వారికి బుద్ది చెప్పేందుకు తగిన సమయం వచ్చిందని.. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చేనెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 7వ తేదీన మూడో విడత ఎన్నికలతో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు. వచ్చేనెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోతోంది.