Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధం
బీహార్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు జరగగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగి ఎన్డీఏ తరఫున ప్రచారం సాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే కూటమి నేతలు , మహా ఘట్ బంధన్ నేతలు మాత్రమే కాకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన ఎల్జేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా బీహార్ ఎన్నికల్లో విమర్శనాస్త్రాలు సందిస్తుంది .
తేజస్వి యాదవ్ కుర్తా పట్టుకుని వేలాడినా ... విజయం ఎన్డీఏదే... కాంగ్రెస్ కు పీఎం మోడీ చురకలు
భారత్ మాతాకీ జై, జై శ్రీరాం అనలేని వాళ్ళతో బీహారీలకు ఇబ్బంది : మోడీ
ఈరోజు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మాతాకీ జై, జై శ్రీరాం అనలేని వాళ్ళతో బీహారీలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యలు చేశారు . కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో కనీసం వంద సీట్లు కూడా లేవని, 100 మంది ఎంపీలను కూడా ప్రజలు పార్లమెంటుకు పంపలేదని ఎద్దేవా చేశారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా శిక్షించారని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్ ఎన్నికలలో తేజస్వి యాదవ్ కుర్తా పట్టుకుని వేలాడుతూ గెలవాలనే ఆశ పడుతున్నారంటూ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదంటూ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
పాత హామీలు నేరవేర్చకుండానే కొత్త హామీలా ? రాహుల్ గాంధీ
ఇదే సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ ప్రజల ఆర్థిక పరిస్థితి పదిహేనేళ్ల నితీష్ ప్రభుత్వంలో ఎందుకు మారలేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకుండానే, ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారంటూ రాహుల్ మండిపడ్డారు. కార్పొరేట్ రుణాలు మాఫీ చేసి పేదలను కొట్టి పెద్దలకు పంచారు అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
కోవిడ్ పై ప్రకటనలు తప్ప మోడీ చేసిందేంటి ?ప్రశ్నించిన రాహుల్ గాంధీ
మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై సైతం విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో నితీష్ ను గద్దె దించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు . కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం ఏమీ లేదంటూ మండిపడ్డారు. కోవిడ్ 19 పై ప్రకటనలు చేయడం తప్పించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిందేమీ లేదన్నారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో అత్యంత ఇబ్బందులు ఎదుర్కొన్నది బిహారీ లే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
పేదల రుణభారం పెంచి, కార్పొరేట్ల రుణాలను రద్దు చేశారని రాహుల్ ఆగ్రహం
పేదల రుణభారం పెంచి, కార్పొరేట్ల రుణాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కి గుణపాఠం చెప్పాలని రాహుల్ గాంధీ బీహార్ ప్రజలను కోరారు. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ , రాహుల్ గాంధీ లు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే బీహార్ లో రెండు దశల్లో ఎన్నికలు పూర్తి కాగా, మూడో దశ పోలింగ్ కోసం రాజకీయ పార్టీలు మాటల వాడి వేడిని పెంచాయి.