నితీష్కు ఎర్త్: వలస కార్మికుల ఎఫెక్ట్: నో డౌట్: వందల కిలోమీటర్లు నడిపించినందుకు ఫలితం?
పాట్నా: బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి రాకపోవచ్చంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దానికి గల కారణాలపై అన్వేషణ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఎంత వరకు నిజం అవుతుందనే మాట అటు ఉంచితే.. బిహార్లో జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనేది ముందునుంచీ వినిపిస్తోన్న అంశమే. దాన్ని ప్రస్ఫూటింపజేసేలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.
నితీష్పై మొహం మొత్తినట్టే..మోడీ మంత్రమూ పనిచేయనట్టే: బిహారీల్లో రాజకీయ చైతన్యం: 63 శాతం
తేజస్వీకే ఛాన్స్?
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు వచ్చిన అంచనాలను ఎగ్జిట్ పోల్స్ నిజం చేశాయి. వివిధ జాతీయ స్థాయి న్యూస్ ఛానళ్లు, మీడియా హౌస్లు, పొలిటికల్ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్.. బిహారీల పల్స్ ఏమిటనేది స్పష్టం చేశాయి. వారు ఎటు వైపు తిరిగారు? ఎవరికి ఓటు వేశారనే అంశాన్ని తేటతెల్లం చేశాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్?
ఏడెనిమిది నెలల కిందట దేశం మొత్తం కొన్ని విషాదకర సంఘటనలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా, రాత్రికి రాత్రి లాక్డౌన్ను ప్రకటించడం, ఏకధాటిగా దాన్ని కొనసాగింపజేయడం వల్ల వలస కార్మికుల జీవితాలు ఎంతగా ప్రభావితం అయ్యాయనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. కోట్లాదిమంది వలస కార్మికులు దేశం ఒక మూల నుంచి మరో మూలకు కాళ్లీడ్చుకుంటూ సాగించిన ప్రయాణం.. కంట తడి పెట్టించింది. రోజుల తరబడి వారు తమ నడకను సాగించారు. వందల కిలోమీటర్లను కాలి నడకన అధిగమించారు. తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురై మరణించిన వారూ లేకపోలేదు.
వలస కార్మికుల దెబ్బ..?
బిహార్.. వలస కార్మికులకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది కార్మికులు.. పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లారు. వేర్వేరు రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. లాక్డౌన్ పరిస్థితుల వల్ల వాళ్లంతా మళ్లీ బిహార్కు చేరుకున్నారు. ఆ చేరుకునే ప్రయత్నంలో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో.. తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ఆవేదనను ఓట్ల రూపంలో ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బిహార్కు తిరిగి వెళ్లిన లక్షలాది మంది వలస కార్మికుల ఓటు బ్యాంకు నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిందనే అంటున్నారు.
44 శాతం తేజస్వి వైపు..
లాక్డౌన్ అమలు చేయడం.. ఆ తరువాత దాన్ని దశలవారీగా ఎత్తేయడం వంటి పరిణామాల తరువాత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మొట్టమొదటి రాష్ట్రం బిహారే. తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి ఇంతకంటే మంచి తరుణం రాదని భావించినట్టు ఉంది. అందుకే- ఈ ఎన్నికల్లో 44 శాతం మందికి పైగా వలస కార్మికుల ఓటుబ్యాంకు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిందని, తేజస్వి యాదవ్కు అనుకూలంగా ఓటు వేసిందని ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. అవి ఏ మేరకు నిజం అవుతాయనేది ఈ నెల 10న నిర్వహించే ఓట్ల లెక్కింపులో తేలుతుంది.