Today's Chanakya: నో హంగ్.. నో నితీష్: ఆర్జేడీ కూటమికే బిహార్: లాలూ కుమారుడికే పట్టం
పాట్నా: బిహార్లో ఇక నితీష్ కుమార్ ప్రభుత్వానికి తెరపడబోతోందా? హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందంటూ మిగిలిన ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాల కూడా తప్పనున్నాయా? టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలు వాటన్నింటికీ భిన్నంగా వెలువడ్డాయి. బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లభించదంటూ వెలువడిన అంచనాలను తలకిందులు చేసింది.. టుడేస్ చాణక్య. తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి భారీ మెజారిటీ లభిస్తుందని అంచనా వేసింది. ల్యాండ్ స్లైడ్ మెజారిటీ సాధిస్తుందని స్పష్టం చేసింది.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో మూడొంతుల మేర సీట్లను ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి సాధిస్తుందని జోస్యం చెప్పింది. మహాఘట్బంధన్ (ఎంజీబీ)కి 169 నుంచి 191 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వాన్ని వహిస్తోన్న జనతాదళ్ (యునైెటెడ్)-భారతీయ జనతా పార్టీకి ఆ సారి పరాభవం తప్పకపోవచ్చని పేర్కొంది. ఎన్డీఏ కూటమికి 44 నుంచి 56 స్థానాలు మాత్రమే దక్కుతాయని పేర్కొంది.
ఇతరులకు 4 నుంచి 12 సీట్లను కట్టబెట్టిందా ఎగ్జిట్ పోల్స్.. 63 శాతం బిహారీయులు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడాలని బిహారీయులు కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన అంశంగా పని చేసిందని, మూడు దఫాలుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. యువతకు ఉపాధిని కల్పించలేకపోయారని బిహారీలు బలంగా నమ్ముతున్నారని, దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడంలో తేజస్వి యాదవ్ సఫలీకృతురయ్యారని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.
ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకు మొత్తాన్ని తేజస్వి యాదవ్ కొల్లగొట్టారనేది దీనితో స్పష్టమౌతోందని పేర్కొంది. అలాగే- సానుభూతి ఓట్లు పెద్ద ఎత్తున సాధించుకోగలిగారని అభిప్రాయపడింది. ఆర్జేడీ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందనే విషయాన్ని బిహారీయులు నమ్ముతున్నారని, ఫలితంగా తటస్థ ఓటుబ్యాంకు కూడా ఆర్జేడీ వైపే మొగ్గు చూపిందని వెల్లడించింది. అలాగే- కాంగ్రెస్కు సంప్రదాయబద్ధంగా పడే ముస్లిం, ఇతర మైనారిటీలు ఆర్జేడీ కూటమికి అనుకూలంగా ఉన్నారని, ఫలితంగా- భారీ మెజారిటీని సాధించడం ఖాయమని పేర్కొంది.