ఆసక్తికరంగా బీహార్ పోరు- ఎన్డీయే మహాకూటమి మధ్య హోరాహోరీ- 28న తొలిదశ పోలింగ్..
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తొలి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికలు గతేడాది భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయేకు కఠిన పరీక్షగా మారాయి. బీహార్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో లుకలుకల నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు జేడీయూ, బీజేపీకి జీవన్మరణ సమస్యగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కూడిన మహాకూటమికీ ఈ ఎన్నికలు కీలకంగా మారిపోయాయి.
Recommended Video
గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ తో కలిసి అధికారం కైవసం చేసుకున్నా ఆ తర్వాత బీజేపీ ఈ కూటమిలో నుంచి ఆయన్ను బైటికి తెచ్చి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి బీహారీలు మరోసారి నితీశ్పై నమ్మకం ఉంచుతారా, మహాకూటమి పేరుతో గెలిచి హ్యాండిచ్చిన నితీశ్ను గద్దె దింపుతారా అన్నది ఆసక్తిరేపుతోంది.
బీహార్ తొలి దశ పోరు..
మూడు దశలుగా జరగబోతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోరుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 28న జరిగే తొలిదశ పోలింగ్లో భాగంగా మొత్తం 71 స్ధానాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుని మరీ నామినేషన్ల స్వీకరణ, ప్రచారం, ఇతర కార్యక్రమాలను ఈసీ చేపడుతోంది. ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణ, ఐదుగురితోనే ప్రచారం చేసుకోవాలని అభ్యర్ధులకు ఈసీ ఆంక్షలు విధించింది. అయితే పోలింగ్ మాత్రం యథావిథిగా నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఓవైపు కరోనా పరీక్షలు, మరోవైపు ఎన్నికల ప్రచారం, ఎత్తులు పై ఎత్తులతో బీహార్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన కూటములు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించాయి.
ఎన్డీయే, మహాకూటమి హోరాహోరీ...
తొలిదశ పోరులో భాగంగా జరగనున్న 71 అసెంబ్లీ స్ధానాల పోలింగ్ కోసం అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి సిద్ధమవుతున్నాయి. ఈ 71 స్ధానాల్లో ఆధిక్యం సాధిస్తే తర్వాతి రెండు దశల్లోనూ అదే ఊపు కొనసాగించవచ్చని రెండు కూటములు భావిస్తున్నాయి. దీంతో ఇందులో ప్రతీ స్ధానం కీలకంగా మారిపోయింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 71 స్ధానాల్లో ఆర్జేడీ 27, కాంగ్రెస్ 9, బీజేపీ 13, జేడీయూ 18, సీపీఐ(ఎంఎల్) ఒక్క సీటూ గెల్చుకున్నాయి. గతంలో మహాకూటమి తరఫున పోటీ చేసి గెలిచిన జేడీయూ, ఆ తర్వాత బీజేపీ పంచన చేరింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి సీటు మాత్రం కాపాడుకున్నారు. అప్పట్లో మహాకూటమి తరఫున గెలిచాక వారికి హ్యాండిచ్చిన నితీశ్పై ఓటర్ల అభిప్రాయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు కీలకాంశంగా మారింది.
మహాకూటమికి అనుకూలంగా సమీకరణాలు..
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 71 స్ధానాల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్తో కూడిన మహాకూటమి 54 స్ధానాలు గెల్చుకుంది. వీటిలో తాము పోటీ చేసిన 29 స్ధానాల్లో 27 స్ధానాలను అప్పట్లో ఆర్జేడీ గెల్చుకుంది. జేడీయూ లేకుండానే మహాకూటమి తరఫున ఈసారి బరిలోకి దిగుతున్న ఆర్జేడీ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈసారి 43 స్ధానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగుతుండగా... గతంలో 13 సీట్లలో పోటీ చేసి 9 గెలిచిన కాంగ్రెస్ ఈసారి 21 సీట్లతో పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీలు గతంలో సాధించిన ఫలితాలు రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. కూటమిలోని మరో పార్టీ సీపీఐ(ఎంఎల్) గతంలో ఒక్కసీటు గెల్చుకోగా.. ఈసారి ఏడు స్ధానాల్లో బరిలో నిలిచింది.
జేడీయూకీ బీజేపీ ఓటు బ్యాంకు మళ్లుతుందా...?
2015 ఎన్నికల సందర్బంగా బీజేపీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఎన్డీయేను వీడి మహాకూటమి పంచన చేరిన నితీశ్ పార్టీ జేడీయూ అప్పట్లో బాగానే లబ్ది పొందింది. అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ నితీశ్పై గౌరవంతో ఆయన్ను సీఎం చేసిన మహాకూటమికి ఆయన హ్యాండిచ్చేశారు. అప్పటి ఎన్నికల్లో తొలిదశలో 29 స్ధానాల్లో పోటీ చేసి కేవలం 18 సీట్లు మాత్రమే జేడీయూ గెల్చుకుంది. అలాగే బీజేపీ 40 స్ధానాల్లో పోటీ చేసి 13 స్ధానాలకే పరిమితమైంది. ఇప్పుడు ఆ అనుభవాలే ఇరుపార్టీలను వెంటాడుతున్నాయి. దీంతో అభ్యర్ధుల ఎంపికతో పాటు పలు సమీకరణాలను నితీశ్ వర్కవుట్ చేస్తున్నారు. అయితే ఎన్డీయేలో ఉన్న లోక్జనశక్తి పార్టీ తాజాగా బయటికొచ్చేసింది. బయటికి రావడమే కాదు జేడీయూ అభ్యర్ధులపై పోటీకి కూడా దిగుతోంది. తద్వారా ఈ కూటమిలో జేడీయూ స్ధానాలపై ప్రభావం పడబోతోంది. దీన్ని అధిగమించడం జేడీయూ ముందున్న ప్రధాన కర్తవ్యం. అదే సమయంలో ఎన్డీయే కూటమిలో ఉంటూనే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్న బీజేపీ, జేడీయూ పోలింగ్ నాటికి సఖ్యత ప్రదర్శిస్తాయా లేదా అన్న అంశమే ఫలితాలను నిర్ణయించబోతోంది.