రెండు గ్యాంగ్ రేప్స్.. మైనర్ బాలిక సజీవ దహనం, బధిర బాలిక కళ్లల్లో పొడిచిన దుండగులు...
ఇటీవలి కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలు,బాలికలపై అత్యంత పాశవికమైన అత్యాచార ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా మహిళలను చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా బిహార్లో రెండు దారుణ అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఒక ఘటనలో బధిర బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడి పదునైన ఆయుధంతో ఆమె కళ్లల్లో పొడిచారు. మరో ఘటనలో మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడి ఆమెను సజీవ దహనం చేశారు.
దారుణం... 45 ఏళ్ల వితంతువుపై గ్యాంగ్ రేప్... ఇనుపరాడ్డుతో చిత్రహింసలు...
ముజఫర్పూర్లో బాలికపై గ్యాంగ్ రేప్...
బిహార్లోని ముజఫర్పూర్లో ఈ నెల 11న ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. బాధిత బాలిక ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలు బుధవారం(జనవరి 13) మృతి చెందింది. సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మధుబనిలో బధిర బాలికపై గ్యాంగ్ రేప్...
బిహార్లోని మధుబని జిల్లా కౌవాహా గ్రామంలో చోటు చేసుకున్న మరో ఘటనలో 15 ఏళ్ల ఓ బధిర బాలిక గ్యాంగ్ రేప్కి గురైంది. మేకలు కాసేందుకు వెళ్లిన ఆ బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. అనంతరం పదునైన వస్తువుతో ఆమె కళ్లల్లో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ కిరాతకానికి ఒడిగట్టారు. ఘటనపై ఎస్పీ సత్య ప్రకాష్ మాట్లాడుతూ... నిందితులు కూడా అదే గ్రామానికి చెందినవారని చెప్పారు.
విషమంగా బాలిక పరిస్థితి..
గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులతో కలిసి ఆ బాలిక మేకలు కాసేందుకు వెళ్లిందని గ్రామ పెద్ద రామ్ ఇక్బాల్ తెలిపారు. ఇంతలో కొంతమంది చిన్నారులు పరిగెత్తుకొచ్చి మనోహర్పూర్ గ్రామంలోని పంట పొలాల్లో ఆ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటం గుర్తించినట్లుగా చెప్పారన్నారు. ప్రస్తుతం ఆ బాలిక కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతోందని... ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఇటీవలి కాలంలో వెలుగుచూసిన దారుణాలు...
రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో 45ఏళ్ల ఓ మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దుండగులు ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. అదే మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార ఘటన కూడా ఇటీవల వెలుగుచూసింది. అంతకుముందు,ఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల మహిళపై స్థానిక ఆలయ పూజారి,అతని అనుచరులు ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. బాధితురాలి జననాంగాలను ఇనుపరాడ్డుతో చిధ్రం చేయడంతో తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది.