మూఢభక్తి: కళ్లు పీకేసుకొన్న బాలిక, ఎందుకంటే?
పాట్నా: భక్తి పేరుతో ఓ బాలిక మూర్ఖంగా వ్యవహరించింది. తన రెండు కళ్ళను పెకిలించి దుర్గామాతకు అర్పించేందుకు యత్నించింది.. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలోని దర్భాంగ జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.
దర్భాంగ జిల్లా బహేరీ బ్లాక్ సిరువా గ్రామానికి చెందిని దుర్గామాత ఆలయంలో చైత్ర నవరాత్రుల సందర్భంంగా ప్రత్యేక పూజలు నిర్వహించే ఆనవాయితీ ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే బాలిక ప్రతి రోజూ దుర్గామాత గుడికి వచ్చి పూజలు నిర్వహించేది.
ఆదివారం కూడ ఆలయానికి వచ్చిన ఆ భక్తురాలు పూజలు జరుగుతున్న సమయంలో తన రెండు కళ్ళను పెకిలించింది. అయితే అక్కడే ఉన్న పూజారితో సహ ఇతర భక్తులు గుర్తించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
పదో తరగతి పరీక్షలో ఆ బాధితురాలు ఫెయిలైంది. దుర్గామాత చెప్పిందనే ఉద్దేశ్యంతోనే ఆమె పరీక్షల్లో ఫెయిలైనట్టుగా చెప్పుకొనేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంటి వద్దే ఉంటున్న బాధితురాలు కొంత కాలంగా విచిత్రంగా ప్రవర్తిస్తోందంటున్నారు.
దుర్గామాత తన కలలోకి వచ్చి ఏదో ఒక అవయవాన్ని తనకు ఇవ్వాలని కోరిందని బాధితురాలి స్నేహితులు చెప్పారు. అయితే ఏడో రోజున అమ్మవారికి కన్ను రూపంలో ఉండే బెల్ పండ్లను సమర్పిస్తామని పూజారి చెప్పారు. కానీ, కోమల్ కుమారి చేసిన పనిని పూజారి తప్పుబడుతున్నాడు. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు.