సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యలో న్యూ ట్విస్ట్: ఇక కేసు మూలాల్లోకి: సీబీఐ ఎంట్రీ: సీఎం
పాట్నా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. తొలుత ఆత్మహత్యగా నమోదైన ఈ కేసు మూలాల్లోకి వెళ్లే కొద్ది కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తి ఉదంతం బహిర్గతమైంది. ఇలాంటి వెలుగు చూడని విషయాలపై కూపీ లాగడానికి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
Recommended Video
కల్లోల కరోనా..అదే స్పీడ్: అరలక్షకు తగ్గకుండా: మరింత భీతావహంగా
సీబీఐ దర్యాప్తునకు రెకమెండ్
ఈ మేరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిహార్లో అధికారంలో జనతాదళ్ (యునైటెడ్) అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. హై ప్రొఫైల్ సూసైడ్ కేసుగా గుర్తింపు పొందిన ఈ కేసును ఛేదించడానికి ముఖ్యమంత్రి నితీష్కుమార్ సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేశారని తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్.. నితీష్ కుమార్ను కలిసిన తరువాత ఈ నిర్ణయం వెలువడింది.
రియా చక్రవర్తి పాత్రపై అనుమానాలు
సుశాంత్ సింగ్ సొంత రాష్ట్రం బిహార్. తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, స్నేహితురాలు రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఇటీవలే కేకే సింగ్ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి మరణంలో రియా చక్రవర్తి పాత్రపై ఆరా తీయాలంటూ ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
రియా అదృశ్యంతో
ఈ కేసు నమోదైన తరువాత రియా చక్రవర్తి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులతో సహా మాయం అయ్యారు. తమ వెంట భారీ సూట్కేసులను తీసుకెళ్లారని ఆరోపణలు రియా చక్రవర్తిపై ఉన్నాయి. తన ప్రమేయం లేకపోతే ఆమె ఎందుకు కుటుంబంతో సహా అదృశ్యం అయ్యారనే అనుమానాలు తాజాగా వ్యక్తమౌతున్నాయి. కేసును నమోదు చేసుకున్న పాట్నా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఏర్పడ్డాయి.
అంతర్రాష్ట్ర కేసు కావడం వల్ల..
సుశాంత్ సింగ్ ముంబైలో ఆత్మహత్య చేసుకోవడంతో.. అక్కడి పోలీసులు ఈ కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ సాగించిన కేసు పురోగతి, దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాలను ఇచ్చిపుచ్చుకోవట్లేదనే ఆరోపణలు ముంబై పోలీసులపై వెల్లువెత్తాయి. తమ దర్యాప్తునకు ముంబై పోలీసులు సహకరించట్లేదంటూ పాట్నా పోలీసులు హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కేకే సింగ్.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలిశారు. తన కుమారుడికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ను ఆయన ఈ సందర్భంగా నితీష్ కుమార్కు అందజేశారు.
ఫిబ్రవరి నుంచి ప్రాణాలకు ముప్పు..
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రమాదంలో ఉన్నారని, ఆయన ప్రాణానికి ముప్పు ఉందనే విషయాన్ని ముంబై పోలీసులు తనకు వివరించినట్లు కేకే సింగ్.. ఇదివరకే చెప్పారు. అదే విషయాన్ని నితీష్ కుమార్ వద్దా ప్రస్తావించారు. అదే సమయంలో ఇది హైప్రొఫైల్ సూసైడ్ కేసు కావడం, రెండు రాష్ట్రాల మధ్య పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో జాప్యం చోటు చేసుకుందని ఆయన చెప్పారు.
ఫిర్యాదు చేసినా..
ఇదే వీడియో క్లిప్పింగ్ను సుశాంత్ సింగ్ రూమ్మేట్ సిద్ధార్థ్ పితానీ కూడా ముంబై పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్పింగ్ సుశాంత్ సింగ్ బావ దగ్గరి నుంచి తనకు వచ్చినట్లు పేర్కొన్నారు. తన కుమారుడికి ముప్పు ఉందంటూ ఫిబ్రవరి 25వ తేదీన కేకే సింగ్ ముంబైలోని బాంద్రా పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన అలాంటి ఫిర్యాదు ఏదీ బాంద్రా పోలీస్స్టేషన్లో నమోదు కాలేదంటూ పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసును నితీష్ కుమార్ సీబీఐకి అప్పగించారు.